● బీఆర్ఎస్ ఆధ్వర్యంలో
ఆటో ర్యాలీ
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ఎన్నికల హామీ మేరకు ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. ‘వెయ్యి రోజుల పాలన.. వెయ్యి మోసాలు’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటో ర్యాలీ అనంతరం తెలంగాణ చౌరస్తాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రూ.12 వేల సాయం కోసం ఆశపడి కాంగ్రెస్కు ఓట్లు వేసిన ఆటో కార్మికులు ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో కార్మికుల జీవనం దుర్భరంగా మారిందని, పిల్లల ఫీజులు, ఆటోల కిస్తీలు చెల్లించలేని పరిస్థితి నెలకొందన్నారు. ఆటో కార్పొరేషన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్న హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రైతులకు కరెంటు, యూరియా అందక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఆటో నడిపిన శ్రీనివాస్గౌడ్
బీఆర్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్వయంగా ఆటో నడిపి కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆయనను అనుసరిస్తూ పెద్ద సంఖ్యలో ఆటోలు ర్యాలీగా కదిలాయి. బీఆర్ఎస్ నాయకులు వెంకన్న, శివరాజు, బీఆర్టీయు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, నాయకులు రాజు, పట్టణ అధ్యక్షుడు బాబుమియా, నగేష్, వీరేష్, తదితరులు పాల్గొన్నారు.


