● లారీని ఢీకొన్న కారు.. ఇద్దరి
దుర్మరణం, మరో ఇద్దరికి గాయాలు
● నలుగురు మిత్రులు జోగుళాంబ
ఆలయాలకు వెళ్తుండగా ప్రమాదం
● గద్వాల జిల్లా ఎర్రవల్లిలో ఘటన
ఎర్రవల్లి: జోగుళాంబ ఆలయాలకు దర్శనానికి వె ళ్తూ జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు మృతి చెందిన ఘటన గద్వాల జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ రవిరాథోడ్, స్థా నికులు తెలిపిన కథనం మేరకు.. హైదరాబాద్లోని మేడ్చల్– మల్కాజ్గిరికి చెందిన ముఖేష్ తన మి త్రులు సాయిరాం(37), మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన మౌనిక (25), గద్వాలకు చెందిన రాఘవతో కలిసి జోగుళాంబ దర్శనం కోసం హైదరాబాద్ నుంచి కారులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ క్రమంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై ఎర్రవల్లి మండలంలోని బీచుపల్లి పదో బెటాలి యన్ పెట్రోల్ బంక్ సమీపంలో కారు అదుపుతప్పి ఒక్కసారిగా ముందు వెళ్తున్న లారీని వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసం కావడంతో అందులో ఉన్న సాయిరాం, మౌనిక అక్కడికక్కడే మృతి చెందగా ముఖేష్, రాఘవ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన 108 వాహనంలో గద్వాలకు తరలించగా మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లినట్లు తెలిపారు. రాఘవ పరిస్థితి విషమంగా ఉంది, మృతుడు సాయిరామ్కు భార్య మాధురితో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతదేహాలకు గద్వాల ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా అతివేగమే ప్రమాదానికి పూర్తి కారణమని స్థానికులు చర్చించుకుంటున్నారు.


