మహబూబ్నగర్ క్రీడలు: జిల్లాలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) పోటీల సందడి నెలకొంది. పాఠశాల స్థాయిలో విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రతి ఏడాది స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. పాఠశాల స్థాయిలో అండర్– 14, అండర్–17 బాల, బాలికలకు వేర్వేరుగా మండల స్థాయి నుంచి మొదలుకొని జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పోటీలను నిర్వహిస్తారు.
నైపుణ్యానికి వేదికగా..
పాఠశాల స్థాయిలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ విద్యా ర్థులకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. గతంలో జిల్లాకు చెందిన ఎందరో క్రీడాకారులు స్కూల్ గేమ్స్ ద్వారానే ప్రతిభ చాటి వెలుగులోకి వచ్చారు. వందలాది మంది విద్యార్థులు జాతీయస్థాయి టోర్నీ ల్లో రాష్ట్రానికి ప్రాతినిథ్యం వహించారు. మహబూబ్నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీల నిర్వహణలో రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు పొందింది. జిల్లా లో ప్రతి ఏడాది రాష్ట్రస్థాయి క్రీడా టోర్నీలతోపాటు జాతీయ స్థాయి టోర్నీలను నిర్వహిస్తుంది.
మండల స్థాయిలో కొనసాగుతున్న పోటీలు..
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు సంబంధించి మండల స్థాయిలో క్రీడలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో టోర్నీ కం ఎంపికలు జరుగుతున్నాయి. మిడ్జిల్, చిన్నచింతకుంట, మహ్మదాబాద్ మండలాల్లో పోటీలు జరిగాయి. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా స్థాయి టోర్నీ కం సెలక్షన్స్లో పాల్గొంటారు. అదే విధంగా ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాస్థాయి, అనంతరం ఉమ్మడి జిల్లా (జోనల్) స్థాయిలో టోర్నమెంట్ కం సెలక్షన్స్ నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో ఎంపికయ్యే జట్లు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటాయి.
మండల స్థాయిలో ఉత్సాహంగా పోటీలు
ఈ నెల 20వ తేదీ వరకు జిల్లాస్థాయి, అనంతరం ఉమ్మడి జిల్లా ఎంపికలు
త్వరలో రాష్ట్రస్థాయి టోర్నీలు


