దేవరకద్ర: కౌకుంట్ల మండలం పుట్టపల్లి గ్రామంలో వ్యక్తి హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన బీచుపల్లి ఉత్తన్న (55) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ భాస్కర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వెల్కమ్మ కుటుంబ సభ్యులకు, ఉత్తన్నకు మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు ఉత్తన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఉత్తన్న తరచూ మద్యం సేవించి గొడవలకు పాల్పడేవాడని గ్రామస్తులు చెబుతున్న నేపథ్యంలో.. అదే వివాదం హత్యకు దారితీసిందా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుల వివరాలను సేకరిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
● దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ఉత్తన్న మృతి?
● హత్యకు గల కారణాలపై పోలీసుల దర్యాప్తు


