ఇటీవల జరిగిన కలుషిత ఆహార ఘటనలో శాంపిల్స్ సేకరించాం. ఇందులో సోరకాయతో తయారు చేసిన స్వీట్ 5– 6 గంటలు మాత్రమే నిల్వ ఉంటుంది. ఆ తర్వాత స్వీట్లో లోపల ఫంగస్, బ్యాక్టీరియా వస్తుంది. దీనివల్ల తిన్నవారికి వాంతులు, విరేచనాలు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారం వండిన తర్వాత 6–8 గంటల వరకు తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ సమయం ఉంటే టాక్సిల్స్ ఏర్పడుతాయి. కలుషిత ఆహారంపై గత నెల 18న అంగన్వాడీలకు శిక్షణ ఇచ్చాం. ఇటీవల తనిఖీలు పెంచడంతోపాటు శాంపిల్స్ సేకరిస్తున్నాం. కలుషిత ఆహారంపై కూడా అవగాహన కార్యక్రమాలు పెంచుతాం.
– శ్రీలత,
ఫుడ్ ఇన్స్పెక్టర్, మహబూబ్నగర్
● పాలమూరులో కలవరపెడుతున్న కలుషిత ఆహార ఘటనలు
● ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు
● అత్యధికంగా నిల్వ చేసిన పదార్థాలతోనే వినియోగదారులకు వడ్డింపు
● ఉమ్మడి జిల్లాకు ముగ్గురే ఫుడ్ ఇన్స్పెక్టర్లతో కనిపించని తనిఖీలు
● మున్సిపాలిటీల్లో శానిటరీ విభాగాలదీ అదే తీరు
పాలమూరు: ఉమ్మడి జిల్లాలో కలుషిత ఆహారంతో అనారోగ్యాలకు గురవుతూ ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, పెళ్లి వేడుకల్లో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫుడ్ పాయిజన్తో అధికంగా చిన్నారులే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నారులు కలుషితమైన ఆహారం తీసుకున్న రెండు గంటల్లో అస్వస్థతకు గురవుతారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా చల్లబడిన వాతావరణం బ్యాక్టీరియా ఎదుగుదలకు అనుకూలంగా ఉండి.. వ్యాధులు విస్తరిస్తాయి. ఈ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మెస్లు, పాఠశాలలు, వసతి గృహాల్లో వంటగదులు శుభ్రంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ వ్యవస్థను పర్యవేక్షించాల్సిన ఆహార భద్రతా అధికారులు సరిపడా లేకపోవడంతో సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఇదే అదునుగా హోటళ్లు, రెస్టారెంట్, ఫాస్ట్ఫుడ్ సెంటర్లలో నిల్వ చేసిన పదార్థాలకు మసాలాలు దట్టించి వినియోగదారులకు అంటగడుతున్నారు.
లక్ష్యం కేటాయింపు
ప్రతి జిల్లాలో ప్రతినెల అన్ని రకాలుగా 25 శాంపిల్స్, 25 తనిఖీలు చేయాలని ఫుడ్ ఇన్స్పెక్టర్లకు లక్ష్యం కేటాయించారు. ఇచ్చిన లక్ష్యం కంటే తక్కువ చేస్తే శాఖ ఇచ్చే నివేదికలో వారి పేరు రెడ్మార్క్లో వస్తోంది. ఒక్కో ఫుడ్ ఇన్స్పెక్టర్కు రెండు జిల్లాలు ఉండటంతో సకాలంలో లక్ష్యం చేరుకోవడం పెద్ద సవాల్గా మారింది. ప్రతి నెలలో సేకరించే నమూనాల్లో హోటళ్లు, బేకరీలు, కిరాణ దుకాణాలు, టిఫిన్ సెంటర్లు, స్వీట్హౌజ్లు ఉండేలా చూసుకోవాలి. ఇక తనిఖీల్లో అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలలు పరిశీలించాల్సి ఉంటుంది. వీటి నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం హైదరాబాద్ ల్యాబ్కు పంపించాలి. ల్యాబ్ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా సదరు నిర్వాహకులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి.
కర్రీపఫ్లో పాము (ఫైల్)


