‘మన ఇసుక వాహనం’ ద్వారా సక్రమంగా సాగని సరఫరా
తీరంలో యథేచ్ఛగా దందా..
జిల్లాలోని దుందుభీ వాగు తీరం వెంబడి గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. ఒకవైపు ప్రభుత్వ ఇసుక రవాణా సక్రమంగా చేపట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులే అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి, కేసీతండా, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం దాసర్లపల్లి, వంగూరు మండలం ఉల్పర గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోంది. ప్రభుత్వ సరఫరా కన్నా రెట్టింపు స్థాయిలో అక్రమ రవాణా సాగుతుండటంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
ఇందిరమ్మ ఇళ్లకూ కొరతే..
జిల్లాలో ప్రభుత్వ ఇసుక సరఫరా సక్రమంగా అమలుకాక ఇళ్ల నిర్మాణదారులకు తీవ్రమైన ఇసుక కొరత నెలకొంది. ఇదే అదునుగా అక్రమార్కులు ఇష్టారీతిగా ధరలు పెంచుతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే ఇసుక సరఫరా చేస్తామని చెబుతుండగా ఎక్కడా అమలుకావడం లేదు. సంబంధిత తహసీల్దార్ల ద్వారా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక సరఫరాకు ఏర్పాట్లు చేస్తామని చెప్పినా ఫలితం లేకపోయింది. దీంతో సమయానికి ఇసుక లభించక ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ముందుకు సాగడం లేదు.
సాక్షి, నాగర్కర్నూల్: జిల్లాలో మన ఇసుక వాహనం ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన ఇసుక సరఫరా సక్రమంగా సాగడం లేదు. ఈసారి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇసుక సరఫరాను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు చెప్పినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ ఇసుక సరఫరా కోసం ఆన్లైన్ ద్వారా ప్రయత్నిస్తే ఎన్ని రోజులైనా బుకింగ్ దొరకడం లేదు. మరోవైపు అక్రమ మార్గాల్లో ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులను సంప్రదిస్తే మాత్రం క్షణాల్లో ఇసుక అందుబాటులోకి వస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది.
అందుబాటులో ఆరు రీచులు..
జిల్లాలోని దుందుభీ వాగు పొడవునా ఇసుక సమృద్ధిగా అందుబాటులో ఉంది. ఈసారి జిల్లావ్యాప్తంగా మొత్తం 17 వరకు రీచుల నుంచి ఇసుక సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అమలులో మాత్రం ఆరు రీచుల్లోనే ఇసుక సేకరణకు ప్రయత్నాలను అధికారులు మొదలుపెట్టారు. ఇందు లో కల్వకుర్తి మండలం లింగసానిపల్లి, వంగూరు మ ండలం పోతిరెడ్డిపల్లి, ఉల్పర, తాడూరు మండలం ఏటిదారిపల్లి, తెలకపల్లి మండలం నడిగడ్డ, ఉప్పునుంతల మండలం మొల్గర గ్రామాల్లో ఇసుక రీచ్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇసుక సేకరణతోపాటు సరఫరాలో తీవ్ర జాప్యం కొనసాగుతోంది.
ప్రభుత్వ ఇసుక కోసం రోజుల తరబడి ఎదురుచూపులు
ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవడానికే తీవ్ర ఇబ్బందులు
మరోవైపు అక్రమార్కుల ద్వారా పెద్దఎత్తున తరలుతున్న వైనం
అక్రమ రవాణాను అరికడితేనే ప్రభుత్వానికి ఆదాయం


