చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
అడ్డాకుల: చట్టాలపై అందరూ అవగాహన పెంంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామంలో బుధవారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. హెల్ప్ లైన్ సెంటర్ 15100కు డయల్ చేసి న్యాయ సహాయం కోసం తగిన సలహాలు పొందవచ్చని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, చిన్న పిల్లలు, మానసిక, శారీరక దివ్యాంగులు, అనాధలు, సీనియర్ సిటిజన్ల కేసుల కోసం ఉచితంగా న్యాయవాదులను అందుబాటులో ఉంచుతున్నట్లు చెప్పారు. న్యాయ సహాయం కోసం మొదట పారా లీగల్ వలంటీర్లను సంప్రదించాలని కోరారు. రైతులకు సంబంధించిన చట్టాల గురించి వారికి అవగాహన కల్పించారు. మూసాపేటలోని అగ్రి లీగల్ ఎయిడ్ క్లీనిక్కు వెళ్లి రైతులు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.గ్రామాల్లో బాల్య వివాహాలను అరికట్టాలని సూచించారు. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించాలని, సమాజంలో అందరు సత్ప్రవర్తనతో మెలగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వి.రాంచందర్, పంచాయతీ కార్యదర్శి సురేష్, ఉప సర్పంచ్ దేవుని శ్రీను, లీగల్ వాలంటీర్ బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఉగాది పచ్చడి విశేషాలు..
ఉగాది నాడు పంచాంగ శ్రవణంతోపాటు పచ్చడికి విశేష ప్రాధాన్యత ఉంది. ఇది షడ్రుచుల సమ్మేళనం. జీవితంలో ఎదురయ్యే మంచీచెడులు, కష్టసుఖాలను ఒకేలా స్వీకరించాలని ఉగాది పచ్చడి చెబుతోంది. పచ్చడి కోసం చెరుకు, మామిడి కాయలు, వేపపువ్వు, చింతపండు, ఉప్పు, మిరపకాయలు, బెల్లం వాడుతారు. ఉగాది పచ్చడిని ఆయుర్వేద శాస్త్రాల్లో ‘నింబ కుసుమ భక్షణం అశోక కళికా ప్రాశనం’ అనే పేర్లతో వ్యవహరించేవారు. బుతుమార్పుల కారణంగా వచ్చే వాత, కాప, పిత్త దోషాలను హరించే ఓ ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది. బెల్లంలోని తీపి సుఖానికి, లాభానికి, ప్రేమకు, విజయానికి సంకేతం. వేపలోని చేదు దుఖానికి, నష్టానికి, ద్వేషానికి సంకేతం. ఈ రెండు కలిపి తినడం అంటే సుఖ దుఃఖాలు, ప్రేమానురాగాలు, విజయాలు చేకూరాలని చెప్పడమే.
జెడ్పీసెంటర్(మహబూబ్నగర్): ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, హాస్టళ్లు, ఏరియా ఆస్పత్రి, పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో వేసవిలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యలు లేకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కుష్బూగుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం మిషన్ భగీరథ, వైద్య, ఆరోగ్య శాఖ, పంచాయతీ రాజ్, విద్యాశాఖ, మహిళా, శిశుసంక్షేమ శాఖల అధికారులకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలు, పీహెచ్సీల్లో ప్రాధాన్యతనిచ్చి విద్య, వైద్యసేవలు అందించాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య, పారిశుధ్యం చర్యలు తలెత్తకుండా సంబంధిత శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలల్లో తాగునీరు, టాయిలెట్ సమస్యలపై చర్చించారు. జడ్చర్ల ఏరియా ఆస్పత్రిలో పారిశుద్ధ్యం, డ్రెయినేజీ సమస్య పరిశీలించాలని అదనపు కలెక్టర్ను ఆదేశించారు. పాఠశాల్లో ఈజీఎస్ ద్వారా మంజురైన 139 టాయిలెట్లలో 58 ప్రగతిలో ఉన్నట్లు, 3 పూర్తయినట్లు డీఆర్డీఓ వివరించారు. ఈ పనులన్నీ ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. 1,163 అంగన్వాడీల్లో 44 చోట్ల తాగునీటి సమస్య ఉందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. మిషన్ భగీరథ ఈఈ తాగునీటి సమస్య పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లకు 594కుగాను 173 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేసినట్లు తెలుపగా మిగతా వాటిని కూడా మంజూరు చేయాలని సూచించారు.


