జెడ్పీసెంటర్ (మహబూబ్నగర్): పదో తరగతి విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ సూచించారు. శుక్రవారం తన చాంబర్ నుంచి విద్యాశాఖ అధికారులతో మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి భయం, ఆందోళన పడకుండా, ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసేలా చూడాలని సూచించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ వారికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని కోరారు. జిల్లా యంత్రాంగం పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించామని, విద్యార్థులు సమయానికి కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.


