మరికల్: మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో విధులు నిర్వహిస్తున్న కల్వకుర్తికి చెందిన రఘుకుమార్ బుధవారం మరికల్ రైల్వేస్టేషన్ దగ్గర పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రైల్వే సిబ్బంది గమనించి వెంటనే 108 అంబులైన్స్కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది డ్రైవర్ను చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చికిత్స పొందుతూవ్యక్తి మృతి
అచ్చంపేట రూరల్: విష పదార్థం తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. సిద్దాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని బ్రాహ్మణపల్లికి చెందిన రామస్వామి(52)మనస్తాపానికి గురై ఈనెల 1న వ్యవసాయ పొలంలో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో పడి ఉండటంతో స్థానికులు గమనించి అచ్చంపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నాగర్కర్నూల్, హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి భార్య రసుల ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ రమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు ఆస్పత్రిలో అధికారుల తనిఖీ
కొల్లాపూర్: పట్టణంలోని సాయికృప ఆస్పత్రిలో బుధవారం రాత్రి వరకు పోలీసులు, వైధ్యశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఓ అబార్షన్ కేసుకు సంబంధించి విచారణలో భాగంగా డీఎస్పీ శ్రీనివాస్యాదవ్, డీఎంహెచ్ఓ రవికుమార్లు ఆస్పత్రిలో రికార్డులు తనిఖీ చేశారు. ఆస్పత్రి వైద్యులను సుధీర్ఘంగా విచారించారు. రాత్రి 9 గంటల తర్వాత ఆసుపత్రి నిర్వాహకులు కొండా శ్రీనివాసులుతో పాటు సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అంతకుముందు డీఎంహెచ్ఓ విలేకరులతో మాట్లా డుతూ ఆస్పత్రిలో గతంలో నిబంధనలకు విరు ద్ధంగా అబార్షన్ చేశారని, ఈ అంశంపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఆస్పత్రిని సీజ్ చేయమని ఉన్నతాధికారులు ఆదేశించారని, ప్రస్తుతానికి స్కానింగ్ యంత్రాలను సీజ్ చేశా మని, గురువారం కలెక్టర్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఈ ఘటనపై ఆస్పత్రి నిర్వాహకుడు కొండా శ్రీనివాసులు మాట్లాడుతూ తనపై కక్షపూరితంగా తప్పుడు కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
తాగునీటి కటకట
● మూడురోజులుగా నిలిచిన మిషన్ భగీరథ నీటి సరఫరా
దేవరకద్ర: పట్టణంలో మూడు రోజులుగా ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల మరమ్మతుతో సోమవారం సాయంత్రం నుంచి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేశారు. బుధవారం ఉదయం 6 గంటల తర్వాత నీటిని విడుదల చేస్తామని అధికారులు చెప్పినా రాత్రి వరకు సరఫరా కాలేదు. దీంతో కొన్ని వార్డుల్లో ప్రజలకు ట్యాంకర్లతో నీటిని అందించారు. బోర్లు ఉన్నవారు ఎలాగో నీటిని వాడుకునే అవకాశం ఉండగా.. కేవలం మిషన్ భగీరథ నీటిపై ఆధారపడిన వారు మాత్రం నీటికోసం పడరాని పాట్లు పడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పిన అధికారులు తాగునీటి సమస్యపై దృష్టిసారించకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.


