ఓట్లు సమానంగా వస్తే..
పాలమూరు: మహబూబ్నగర్ కార్పొరేషన్తో పాటు దేవరకద్ర, భూత్పూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ శుక్రవారం పాలమూరు యూనివర్సిటీలో నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో మధ్యాహ్నం వరకు పూర్తి చేసి విజేతలను ప్రకటించనున్నారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, మున్సిపల్ కమిషనర్ రామానుంజులరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కౌంటింగ్ సిబ్బందితో పాటు రిటర్నింగ్ అధికారులకు ప్రత్యేక ఆదేశాలు ఇచ్చారు.
● మహబూబ్నగర్ కార్పొరేషన్లో మొత్తం 59 డివిజన్లకు ఎన్నికలు నిర్వహించారు. 67.73శాతం పోలింగ్ కాగా 1,31,765 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 59 డివిజన్లకు కలిపి మొత్తం 30 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్కు ఐదుగురు సిబ్బందిని కేటాయించారు. మొత్తం 150 మంది ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయగా వీరు ఒక్కో టేబుల్పై రెండు డివిజన్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఒక్కో రౌండ్లో వెయ్యి ఓట్లు లెక్కించనున్నారు. మొత్తం 59 డివిజన్లలో 3 వేల ఓట్లలోపే పోలింగ్ జరిగిన నేపథ్యంలో మూడు రౌండ్లలో లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. కొన్ని డివిజన్లలో రెండు రౌండ్లలోనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. భూత్పూర్ మున్సిపాలిటీలో 10 వార్డులు ఉండగా 40 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు కోసం 10 టేబుల్స్ ఏర్పాటు చేసి 30 మంది లెక్కింపు సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్పై వెయ్యి ఓట్లు లెక్కింపు చేయనున్న నేపథ్యంలో ఒకే రౌండ్లో పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే దేవరకద్ర మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా 40 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 12 టేబుల్స్ ఏర్పాటు చేసి ఒక్కో టేబుల్కు ముగ్గురు సిబ్బంది చొప్పున మొత్తం 36 మందిని నియమించారు. 12 వార్డుల్లో వెయ్యిలోపే ఓట్లు ఉన్న నేపథ్యంలో ఒకే రౌండ్లో పూర్తి చేసి ఫలితాలు ప్రకటించనున్నారు.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో ఒకే వార్డులో ఇద్దరు అభ్యర్థులకు ఓట్ల లెక్కింపులో ఓట్లు సమానంగా వస్తే అధికారులు డ్రా.. లేదా టాస్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకటి రెండు చోట్ల సమానంగా వస్తే డ్రా ద్వారా విజేతను ఎంపిక చేశారు.


