
ఎట్టకేలకు కందులు కాంటా
రూ. 200 ఇవ్వనింకే
బిచ్చగాళ్లమా?
ఈ ఫొటోలో కనిపిస్తున్నది మద్దూర్ మండలం మన్ననూర్కు చెందిన మహిళా రైతు ఎల్లమ్మ. తాను ఐదు బస్తాల ఎర్ర కందులు తెస్తే.. క్వింటాకు రూ. 8,780 ధర వేశారు. శనివారం రూ. 10 వేలు పలికిన ధర.. ఇప్పుడు రూ. 9వేలలోపు ఎలా తగ్గుతుందంటూ అధికారులను నిలదీశారు. కందుల ధరలపై రూ. 2వేలు ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తుంటే.. రూ. 200 పెంచుతామని అంటున్నారని.. మేమేమి బిచ్చగాళ్లమా అని ప్రశ్నించారు.
రూ.4 కమీషన్
తీసుకుంటారా?
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు దామరగిద్ద మండలం వత్తుగుండ్ల గ్రామానికి చెందిన హన్మంతు. 7 బస్తాల తెల్ల కందులను మార్కెట్కు తీసుకువస్తే రూ. 9,680 ధర వేశారు. రూ. 200 పెంచితే రూ.9,860 అవుతుంది. శనివారం రూ. 11 వేలు ఉన్న ధర సోమవారం రూ. 10వేలకు పడిపోయిందని.. కమీషన్ రూ. వందకు రూ.4 తీసుకునేందుకు వస్తుంది కాని రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వరంటూ అధికారులను నిలదీశారు. ఇందుకు అధికారులు సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు.
పేటలోనే అధిక ధరలు..
ఇతర మార్కెట్ల కంటే నారాయణపేట మార్కెట్లోనే కందులకు అధిక ధరలు ఉన్నాయి. ఇందులో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు ఎవరూ కుమ్మక్కు కాలేదు. ఈనామ్లో సరుకుకు టెండర్లు వేస్తాం. మిల్లర్లు వారికి కావాల్సిన రేట్లకు ధరలు కోడ్ చేస్తారు. రోజురోజు ధరల్లో మార్పు ఉంటుంది. రైతులు అర్థం చేసుకోవాలి.
– పవన్కుమార్ లాహోటి,
గంజ్ అసోసియేషన్ అధ్యక్షుడు
నారాయణపేట: ఆరుగాలం కష్టించి పండించిన కందులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదంటూ రైతులు సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి చేపట్టిన ఆందోళన.. మంగళవారం సాయంత్రం 4 గంటలదాక కొనసాగింది. మార్కెటింగ్ ఉన్నతాధికారుల జోక్యంతో రైతులు శాంతించారు. 24 గంటల తర్వాత కందులను కాంటా కావడంతో ఇటు అధికారులు, ఆటు పాలకులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. సోమవారం కందులపై వేసిన ధరలు తమకు గిట్టుబాటు కాలేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. రైతు సంఘాల ఆధ్వర్యంలో మార్కెట్ కార్యాలయం ఎదుట భైఠాయించి ధర్నా చేపట్టారు. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి ఓ మారు వ్యాపారులతో చర్చించడంతో రూ. వంద పెంచేందుకు ఒప్పుకొన్నారు. ఆ ధరకు తాము ఇవ్వమంటూ రైతులు సోమవారం రాత్రి 10 గంటలకు వెళ్లిపోయారు. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు మార్కెట్కు చేరుకున్న రైతులు.. తెల్లకందులకు రూ. 11 వేలు, ఎర్ర కందులకు రూ. 10,500 ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. ఇవ్వలేమని వ్యాపారులు చెప్పడంతో స్థానిక మార్కెట్ యార్డు ఎదుట కొందరు, అంబేడ్కర్ చౌరస్తాలో మరికొందరు రైతులు రాస్తారోకోకు దిగారు. దీంతో అటు, ఇటు వాహనాలు భారీగా నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న సీఐ శివ శంకర్, ఎస్ఐ వెంకటేశ్వర్లు మార్కెట్ యార్డుకు చేరుకొని రైతులను శాంతింపజేశారు.
మార్కెట్ పరిస్థితిపై ఆరా తీసిన జేడీఎం
వ్యవసాయ మార్కెట్ యార్డులో కంది రైతుల ఆందోళనపై రాష్ట్ర వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ మల్లేశం ఆరా తీశారు. ఆర్డీడీఎం ప్రసాద్రావుకు ఫోన్ చేసి కందుల ధరలు, వాస్తవ పరిస్థితి, రైతుల ఆందోళన తదితర వివరాలను తెలుసుకున్నారు. సోమవారం ధరలు తక్కువగా ఉన్నాయంటూ రైతుు ఆందోళనకు దిగారని.. వ్యాపారులతో చర్చించి సమస్యను పరిష్కరించినట్లు వివరించారు.
ఇదిగో ఇతర మార్కెట్ల ధరలు..
రాష్ట్రంలోని వివిధ మార్కెట్ యార్డుల్లో కందుల ధరల కంటే నారాయణపేటలోనే ఎక్కువగా ఉన్నయంటూ ఆర్డీఓ రాంచందర్ నాయక్ రైతులకు చెప్పుకొచ్చారు. 16న ఎర్ర కందులకు షాద్నగర్లో క్వింటాకు రూ. 7,759, తాండూర్లో రూ. 9,249, జహీరాబాద్లో రూ. 9,755, బాదేపల్లిలో రూ. 8,066, కర్ణాటకలోని యాద్దీర్లో రూ. 10,112, తెల్లకందులకు రూ. 11,030 ధరలు పలికాయని తెలిపారు. అదే నారాయణపేటలో తెల్లకందులు రూ. 10,901, ఎర్ర కందులు రూ. 10,756 పలికాయని వివరించారు. 17న తాండూర్లో రూ. 9,359, జహీరాబాద్లో రూ. 9,351, బాదేపల్లిలో రూ. 7,940 ధర పలికిందని చెప్పారు. దీంతో రైతులు ఆగ్రహిస్తూ.. ఆ ధరలు మాకు చెప్పకండి, శనివారం వచ్చిన ధరలు ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు. సోమవారం వేసిన ధరలకు రూ.500 పెంచి ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.
24 గంటల తర్వాత శాంతించిన రైతులు
వ్యాపారులు, రైతులతో పలు దఫాలుగా అధికారుల చర్చలు
క్వింటాకు రూ. 250 అదనంగా చెల్లించేందుకు ఒప్పుకొన్న వ్యాపారులు
నాణ్యత, డిమాండ్ మేరకు..
ఽమార్కెట్కు రైతులు తీసుకువచ్చే సరుకులకు నాణ్యత, సరఫరా, జాతీయ వ్యవసాయ మార్కెట్లో డిమాండ్ మేరకు వ్యాపారులు ధరలను కోడ్ చేస్తారని ఆర్డీడీఎం ప్రసాద్రావు రైతులకు చెప్పుకొచ్చారు. అందుకు రైతులు ససేమిరా అంటూ శనివారం నుంచి సోమవారం వరకు రూ. 2వేలు ఎలా తగ్గుతాయంటూ నిలదీశారు. ఇప్పటికే వ్యాపారులతో చర్చించడం జరిగిందని.. సోమవారం వేసిన ధరల కోడ్కు అదనంగా రూ. 200 ఇచ్చేందుకు ఒప్పించామంటూ ఆర్డీడీఎం రైతులను సముదాయించారు. అయితే తమకు రూ. 500 పెంచాల్సిందేనంటూ రైతులు మళ్లీ రోడ్డెక్కారు. మార్కెట్ కమిటీ చైర్మన్ శివారెడ్డి, డీఎంఓ బాలమణి, మార్కెట్ కార్యదర్శి భారతి, ఆర్డీఓ రాంచందర్ నాయక్లు మరోసారి వ్యాపారులతో చర్చించారు. చివరకు రూ. 225 పెంచేందుకు ఒప్పుకున్నారు. సాయంత్రం 6 గంటల సమయంలో షాపు నంబర్ 41లో ఆర్డీడీఎం దగ్గరుండి కందులను కాంటా చేయించారు.

ఎట్టకేలకు కందులు కాంటా

ఎట్టకేలకు కందులు కాంటా

ఎట్టకేలకు కందులు కాంటా

ఎట్టకేలకు కందులు కాంటా