కేయూ క్యాంపస్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నప్పటికీ విద్యార్థుల్లో మేధాశక్తికి గణితం కీలకంగా ఉంటుందని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రామచంద్రం అన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో శుక్రవారం గణితం విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి (ఎంటీటీఎస్) మ్యాథ్స్మెటిక్స్ ట్రైనింగ్ అండ్ టాలెంట్ సెర్చ్ ఓవర్చ్యూర్ –2026 ప్రోగ్రాంలో భాగంగా వివిధ జిల్లాలకు చెందిన డిగ్రీ విద్యార్థులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గణతాన్ని కేవలం ఒక పాఠ్యాంశంగా కాకుండా నిత్యజీవితంలో విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉపయోగపడే నైపుణ్యాలుగా భావించాలన్నారు. హైదరాబాద్లోని ఐఐటీ ప్రొఫెసర్ సుకుమార్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణితాన్ని సులభతరంగా నేర్చుకోవచ్చని వివరించారు. కేయూ ఓఎస్డీ ఆచార్య వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రాథమిక గణితంలోని భావనలు, సూత్రాలపై అవగాహన ఎంతో అవసరమని అన్నారు. పోటీ పరీక్షలకు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవహారాల్లో గణిత పరిజ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య జ్యోతి, యూనివర్సిటీలోని గణితం విభాగం అధిపతి డాక్టర్ బీఎస్ఎల్ సౌజన్య, ప్రోగ్రామ్ కన్వీనర్ డాక్టర్ నాగయ్య, గణిత విభాగం అధ్యాపకురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, రవికుమార్, అంజన్రావు, డాక్టర్ మంజుల, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రెహమాన్ మాట్లాడారు.
కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం


