జనగామ: అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన భూ ఆరోపణలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్రంగా ఖండించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం తనపై చేసిన ఆరోపణలు అసత్యమన్నారు. భూ కబ్జాలకు సంబంధించిన ఆధారాలు చూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. తన వారసత్వ భూములు విక్రయించి రాజకీయాల్లోకి వచ్చానే తప్ప, కబ్జాలకు పాల్పడలేదన్నారు. తనపై, బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణలు చేయడం కాదు ధైర్యం ఉంటే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీశ్రావు తదితర బీఆర్ఎస్ నాయకులు భూ వ్యవహారాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే వారిని అసెంబ్లీకి రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్రెడ్డికి లేదన్నారు. తెలంగాణ కోసం పదవులకు రాజీనామా చేసేందుకు తాము సిద్ధపడిన సమయంలో రేవంత్రెడ్డి తప్పించుకుని పారిపోయారని ఆరోపించారు.
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు


