హన్మకొండ చౌరస్తా: బతికుండగానే తమ డబ్బులు ఇప్పించండంటూ ఆర్టీసీ కార్మికులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల జేఏసీ నాయకులు లక్ష్మ య్య, మనోహర్, వెంకన్న, రవీందర్, సోమయ్య తెలిపారు. హనుమకొండ పబ్లిక్గార్డెన్లో గురువారం సుమారు 300 మంది విశ్రాంత ఉద్యోగులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని అనేకసార్లు బస్సు భవన్ దగ్గర నిరసన తెలిపామని, ఆర్టీసీ ఎండీకి పలుమార్లు వినతి పత్రాలు సమర్పించామన్నారు. అలాగే, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు విన్నవించినా ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వందలాదిమంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయారని, వారి కుటుంబాల రోడ్డున పడ్డాయన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఈ నెల 8న శాంతియుత నిరసన తెలపడానికి వెళ్తే వందలాది మందిని అరెస్ట్ చేశారన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమ సమస్యలు పరిష్కరిస్తామంటూ హామీ ఇచ్చి, ఇప్పుడు నిర్భందించడం సరి కాదన్నారు. హైకోర్టు అడ్వకేట్ ఎం. మోహన్ రావు మాట్లాడుతూ ఇప్పటికే సుమారు 500 మంది ఆర్టీసీ కార్మికుల తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీంతో హైకోర్టు.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వానికి నాలుగు వారాల గడువిచ్చిందన్నారు. హనుమకొండ లేబర్ కోర్టు అడ్వకేట్ రమణ, జేఏసీ నాయకులు ఎంఎస్ రావు, రవీందర్ రెడ్డి, కె.ఎన్ రెడ్డి, సుధాకర్, ఈఎల్ నారాయణ, విశ్వనాథం, కోటగిరి వీరన్న, హయగ్రీవచారి తదితరులు పాల్గొన్నారు.
హైకోర్టులో ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల పిటిషన్


