సాక్షి, మహబూబూబాద్/ డోర్నకల్: నాటి నిజాం నిరంకుశ పాలనలో తెలంగాణ ప్రజలు చిత్రహింసలు అనుభవించారు. అయితే ఓపిక నశించి తిరుగుబాటు చేసి ఎంతో మంది అమరులయ్యారు. కాగా, అన్ని పోరాటాల్లో మానుకోట భాగస్వామ్యం ఉన్నట్లే.. తెలంగాణ సాయుధ పోరులో నిజాం సైన్యానికి ఎదురొడ్డి ప్రాణాలు అర్పించిన వారు.. తెగబడి కలబడి.. రజాకార్లను ఊళ్ల నుంచి తరిమికొట్టిన వారు ఉన్నారు. నిజాం అరాచకాలను ఎండగడుతూ.. ప్రజల్లో చైతన్యం నింపిన వారి ఆచూకీ తెలపాలని కొందరిని, సాయుధులను పట్టుకొని ఒకేచోట 21మందిని కాల్చి చంపిన ఘటన జిల్లాలోని డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీసలో జరిగింది. కాగా, ఈ ఘటనపై నేటికీ ప్రజలు పాటలు, కథల రూపంలో భావితరాలకు పోరాట చరిత్రను అందిస్తున్నారు.
21 మందిని పొట్టనపెట్టుకున్న రజాకార్లు..
డోర్నకల్ మండలం పెరుమాళ్ల సంకీస గ్రామంలో 78 ఏళ్ల క్రితం జరిగిన రజాకార్ల దాడులకు సంబంధించి బాధితులు, సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందుతుండడంతో నాటి సాక్షాలు కనుమరుగవుతున్నాయి. 1948 సెప్టెంబర్ ఒకటో తేదీన రజాకార్ల దళాలు పెద్ద ఎత్తున పెరుమాళ్ల సంకీస గ్రామంపై దండెత్తి ఆడ, మగ, వృద్ధులు, పిల్లులు తేడా లేకుండా విచక్షణారహితంగా దాడులు చేశాయి. తెలంగాణ సాయుధ పోరాట దళాల ఆచూకీ చెప్పాలంటూ గ్రామస్తులందరినీ ఒకచోట చేర్చి కాల్పులు జరపడంతో 21మంది అమరులయ్యారు. అనేకమంది మహిళలపై అత్యాచారం చేసి ఆస్తులపై దాడులు చేశారు. నాటి ఘటనను గ్రామస్తులు నేటికీ చర్చించుకుంటున్నారు. నాటి ఘటనలో గాయపడ్డ వారు, ప్రత్యక్షంగా చూసినవారు ఒక్కొక్కరుగా చనిపోవడంతో చరిత్ర కనుమరుగవుతోంది. సంకీస గ్రామంలో 21మంది మృతుల జ్ఞాపకార్థంగా చెరువు వద్ద 21మంది పేర్లతో శిలాఫలకం, గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట స్మారక స్తూపం ఏర్పాటు చేశారు.
సాయుధుల జాడ చెప్పాలని చిత్ర హింసలు
ఆడ, మగ, వృద్ధులు, పిల్లలు తేడా లేకుండా దాడులు
గ్రామ నడిబొడ్డున 21మందిపై
తుపాకులతో కాల్పులు
పెరుమాళ్ల సంకీస పాశవిక చర్య సాయుధ పోరుకు నిలువుటద్దం
కథలు, పాటల రూపంలో నేటితరానికి చరిత్ర అందజేత


