లెట్రల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్
ఖిలా వరంగల్: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన, అల్పాదాయ వర్గాలకు చెందిన విద్యార్థులకు చక్కని అవకాశం కల్పిస్తోంది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం(జేఎన్వీ). ఇందులో సీటు లభిస్తే విద్యార్థి భవిత బంగారంగా మారుతుంది. ఈ క్రమంలో 2027–2028 విద్యా సంవత్సరంలో 9వ,11వ తరగతుల్లో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈనేపథ్యంలో ప్రవేశాలకు దరఖాస్తు ఎలా చేసుకోవాలి? విద్యాలయంలో లభిస్తున్న సదుపాయాలు,సౌకర్యాలు, రి జర్వేషన్లు తదితర వివరాలపై ‘సాక్షి’ కథనం
9వ తరగతికి ఇలా..
2026–2027 విద్యా సంవత్సరంలో 8వ తరగతి చ దువుతున్న విద్యార్థులు 9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి 01–05–2012 నుంచి 31–07–2014 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష తేదీ వరకు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 8వ తరగతి ఉత్తీర్ణత సాధించి విద్యా సంవత్సరం పూర్తి చేసి ఉండాలి.
11వ తరగతిలోకి..
2026–2027 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 11వ తరగతి ప్రవేశానికి అర్హులు. 01–06–2010 నుంచి 31–07–2012 మధ్య జన్మించి ఉండాలి. జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న అదే జిల్లాలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, విద్యా సంవత్సరం పూర్తి చేసి ఉండాలి.
గ్రామీణ విద్యార్థులకు 75 శాతం సీట్లు
మామునూరు నవోదయ విద్యాలయ ప్రవేశాల్లో గ్రామీణ విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయిస్తారు. విద్యార్థి తన చదువులో ఏదైనా భాగాన్ని పట్టణ, నగర ప్రాంతంలోని పాఠశాలలో చదివితే అర్బన్ అభ్యర్థిగా పరిగణిస్తారు. గ్రామీణ ప్రాంతంగా గ్రామ పంచాయతీ పరిధిలోని పాఠశాలలను, పట్టణ, నగర ప్రాంతంగా మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలను పరిగణిస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల, బాలికలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఉచిత వసతి.. విద్య
మామునూరు జవహర్ నవోదయ విద్యాలయం పూర్తిగా ఉచిత విద్యనందించే సహ విద్య, నివాస పాఠశాలలు, 6 నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్ ఈ అనుబంధంతో ఎన్సీఈఆర్టీ పాఠ్య ప్రణాళిక ఆధారంగా విద్యాబోధన కొనసాగుతోంది. విద్యార్థుల సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యం ఇస్తూ, 9వ తరగతి నుంచి హిందీ మాట్లాడే ప్రాంతాలు–మాట్లాడని ప్రాంతాల మధ్య విద్యార్థుల మైగ్రేషన్ విధానం అమలు చేస్తారు.
ఆన్లైన్లో దరఖాస్తులు
అర్హత కలిగిన విద్యార్థులు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ https:// cbseitms.nic.in/2026/nvsix&9 ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. 9వ, 11వ తరగతులకు ప్రత్యేకంగా దరఖాస్తు లింక్లు అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని పీఎం పాఠశాల–జవహర్ నవోదయ విద్యాలయ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ టి.రమేశ్ కోరారు.
మామునూరు జేఎన్వీలో 9వ, 11వ తరగతుల్లో ప్రవేశాలు
ఖాళీ సీట్ల భర్తీకి లెట్రల్
ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–2027
సెప్టెంబర్ 30వ తేదీ వరకు
ఆన్లైన్లో దరఖాస్తులు
ఏప్రిల్ 10న ప్రవేశ పరీక్ష
9వ ,11వ తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లెట్రల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్–10 ఏప్రిల్ 2027న నిర్వహించనున్నారు. అర్హత ఉన్న విద్యార్థులు 30 సెప్టెంబర్, 2026 లోగా ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించాలి.


