హన్మకొండ చౌరస్తా : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం త్యాగాలు, ఆత్మబలిదానాలు చేసిన ఉద్యమకారుల స్థితిగతులను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించేందుకు గురువారం (ఈనెల17) నుంచి ఓదార్పు యాత్రకు శ్రీకారం చుడుతున్నట్లు తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్, ప్రముఖ న్యాయవాది గుడిమళ్ల రవికుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం హనుమకొండ కాకతీయ కాలనీలోని వేదిక కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మొదటి రోజు ఉదయం 10 గంటలకు వరంగల్లోని ఎస్బీఐ పక్కన గల తొలిదశ అమరవీరుడు చుంచు చంద్రమౌళి, షేక్ ఫకీర్ అలీ, ఆడెపు మార్కండేయ, గూడూరు వెంకటస్వామి జ్ఞాపకార్థం ఏర్పాటు చే సిన స్మారక జెండా వద్ద అమరులకు నివాళులర్పించనున్నట్లు తెలిపారు. 18,19,20 తేదీల్లో వరంగల్ జిల్లాలో అమరుల, ఉద్యమకారుల ఇళ్లకు వెళ్లి వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులు తెలుసుకుంటూ వివరాలు రికార్డు చేయనున్నట్లు తెలిపారు. ఈ యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏడాదిన్నర పాటు కొనసాగుతుందని తెలిపారు. సమావేశంలో ఉద్యమకారుల ఓదార్పు యాత్ర రాష్ట్ర ఇన్చార్జ్ ఓడపెల్లి శ్యామకృష్ణ, తొలిదశ ఉద్యమకారుల రాష్ట్ర కన్వీనర్ టీఎన్ స్వామి, తొలిదశ ఉద్యమకారుడు కొండేటి నారాయణ రెడ్డి, ఎ.తిరుపతి రెడ్డి, తౌటం సమ్మయ్య, వరంగల్ జిల్లా ఓదార్పు యాత్ర ప్రచార కమిటీ సభ్యులు చాంద్ పాషా, చెన్నూరి నటరాజ్, ఇమ్మడిశెట్టి రాజు, మేకల కృష్ణ, అనుముల రమేశ్, మాధవీలత, మీడియా ఇన్చార్జ్ రాంపెల్లి శ్రీనివాసచారి, పద్మ , కిరణ్, చుంచు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమకారుల ఐక్య వేదిక
రాష్ట్ర అధ్యక్షుడు గుడిమళ్ల


