● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్ రూరల్: ఓటరు జాబితాలో తమ పేరు నిర్ధారించుకోవడం ఓటర్లు బాధ్యతగా భావించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని అమనగల్, బలరాంతండా గ్రామాల్లో ఎస్ఐఆర్ నోటీసులు అందుకున్న ఓటర్లకు నిర్వహిస్తున్న హియరింగ్ కార్యక్రమాలను కలెక్టర్ మంగళవారం స్వయంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నోటీసులు అందిన ఓటర్లు తమ గుర్తింపు కార్డులతో కేటాయించిన తేదీల్లో హాజరై ఓటరు జాబితాలో తమ పేరు నిర్ధారణ చేసుకోవాలన్నారు. ప్రభుత్వ సెలవుల్లో సైతం ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించడం జరిగిందని, ఇంకా ఎవరైనా మ్యాపింగ్ చేసుకోని వారు ఉంటే స్వచ్ఛందంగా వచ్చి తక్షణమే మ్యాపింగ్ చేసుకోవాలని సూచించారు. తద్వారా పారదర్శకమైన ఓటరు జాబితా తయారు చేయడం కోసం ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు. డబుల్ ఓటింగ్, చనిపోయిన వారు, షిఫ్ట్ అయినవారు, మార్పులు, చేర్పులు, కొత్తగా ఓటరు నమోదు, తదితర కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇంకా సమయం ఉన్నందున ప్రతీఒక్కరు తమకు అందిన నోటీసుల ద్వారా తెలియజేసిన సమాచారంతో సంబంధిత పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ ఓటును భద్రపరచుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాజేశ్వర్, ఆమనగల్ సర్పంచ్ కోట విజయేందర్ తదితరులు ఉన్నారు.


