చాకలి ఐలమ్మను
స్ఫూర్తిగా తీసుకోవాలి..
● ఐద్వా జాతీయ కార్యదర్శి కనినికా ఘోష్
పాలకుర్తి టౌన్: పోరాటాలతోనే ప్రభుత్వాల మెడలు వంచి ప్రజలు తమ హక్కులు సాధించుకోవాలని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినికా ఘోష్ పిలుపునిచ్చారు. బీజేపీ ‘సబ్ కా సాత్–సబ్ కా వికాస్’ నినాదాలను ఆచరణలో పెట్టకుండా ప్రచారానికే పరిమితమైందని విమర్శించారు. తెలంగాణ రైతాంగా సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా మంగళవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో వీరవనితల స్ఫూర్తి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఐద్వా జిల్లా కార్యదర్శి ఎండీ షబానా అధ్యక్షతన నిర్వహించిన సభలో జాతీయ ఉపాధ్యక్షురాలు ఎస్. పుణ్యవతితో కలిసి కనినికా ఘోష్ మాట్లాడారు. 1946 నుంచి 1951 వరకు సాగిన తెలంగాణ రైతాంగ పోరాటం దొరలు, భూస్వాములు, జాగీర్దాలు, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజం స్ఫూర్తితో మహిళలు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ రైతాంగ పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ పాత్ర లేదన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు అరుణాజ్యోతి, టి.జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శి బుగ్గవేటి సరళ, కె. ఆశలత, నలిగంటి రత్నమాల, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, బత్తుల హైమావతి, జిల్లా అధ్యక్షురాలు ఇ.వి అహల్య, తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తిటౌన్ (దేవరుప్పుల) : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ‘సబ్ కా సాత్’ నినాదాలకే పరిమితమవుతున్న క్రమంలో సమస్యల పరిష్కారం కోసం నేటి మహిళలు.. చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలని ఐద్వా జాతీయ కార్యదర్శి కనినికా ఘోష్ అన్నారు. వీరవనితల స్ఫూర్తి యాత్రలో భాగంగా మంగళవారం దేవరుప్పుల మండలం ధర్మాపురంలో దర్గ్యా నాయక్ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం కామారెడ్డిగూడెంలో షేక్ బందగీ, కడవెండిలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య స్మారక స్తూపం, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు.


