పరిష్కరించే వరకు ఐక్యపోరాటం
హన్మకొండ: రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించే వరకు ఐక్య పోరాటం కొనసాగిద్దామని రైస్ మిల్లర్లు పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర రైస్ మిల్లర్ల అసోసియేషన్ పిలుపు మేరకు హనుమకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా రైస్ మిల్లర్లు శుక్రవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు రైస్ మిల్లర్లు మాట్లాడుతూ మిల్లుల ఫిజికల్ వెరిఫికేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సర్క్యులర్ మిల్లులకు శరాఘాతంగా మారిందన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ ఆకస్మిక దాడులను వెంటనే నిలిపివేయాలని కోరారు. గత రెండు నెలలుగా రన్నింగ్ మిల్లర్లపై నమోదైన కేసులను భేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో హనుమకొండ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేన్ అధ్యక్షుడు పెద్ది ప్రవీణ్కుమార్, సెక్రటరీ రాధికా ప్రదీప్, ట్రెజరర్ లక్ష్మణ్రావు, వైస్ ప్రెసిడెంట్ నూక సంతోష్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు గోనెల రవీందర్, సెక్రటరీ బూరల సత్యనారాయణ, ట్రెజరర్ కోటేశ్వర్రావు, మిల్లర్లు తోట సంపత్కుమార్, దేవునూరి అంజయ్య, పెద్ది వెంకటనారాయణ గౌడ్, ఇరుకుల్ల రమేష్, రాజు శ్రీనివాసరావు, జైపాల్రెడ్డి, దుబ్బా రమేష్, మూధవ శంకర్, యగందర్, దామెదర్, తదితరులు పాల్గొన్నారు.


