సాక్షి, మహబూబాబాద్: జిల్లా వైద్యారోగ్యశాఖలో మెరిట్ జాబితాను పక్కన పెట్టి.. ముడుపులు ఇచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తున్నారు. కాగా, తమకు అన్యాయం జరిగిందని పలువురు మెరిట్ అభ్యర్థులు ఉన్నతాధికారులను ఆశ్రయించడంలో మళ్లీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడుతున్నారు. దీంతో మెరిట్ జాబితాలో ఉద్యోగం వచ్చిన వారు నిర్భయంగా ఉండగా.. అక్రమమార్గంలో నియామకమైన వారు తమ ఉద్యోగం కాపాడుకునేందుకు పైరవీలు మొదలు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
గతంలో బయటపడిన అక్రమ నియామకాలు
నూతన జిల్లా ఏర్పాటు తర్వాత అన్ని విభాగాల్లో ఉద్యోగ నియామకాలు జరిగాయి. ప్రధానంగా వైద్యారోగ్యశాఖలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతిలో వందలాది ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశారు. ఇందులో మూడో ఏఎన్ఎం, స్టాఫ్ నర్సులు, డైక్ సెంటర్, టీబీ సెంటర్లలో నియామకాలతో పాటు పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సబ్సెంటర్లను ఏర్పాటు చేసి ఎంఎల్హెచ్పీలను నియమించారు. కాగా మూడో ఏఎన్ఎం, స్టాఫ్ నర్సు, డైక్ సెంటర్, టీబీ విభాగంలో ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. పలువురు అధికారులు ఒక్కో ఉద్యోగానికి రూ.లక్ష నుంచి రూ. 2లక్షల వరకు తీసుకొని పోస్టులను భర్తీ చేశారు. వీటిపై ఫిర్యాదులు రాగా.. డైక్ సెంటర్లో సైకాలజీ పోస్టుకోసం ఎంపిక చేసిన వ్యక్తి సర్టిఫికెట్ సరైనది కాదని తేలడంలో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసి తొలగించారు. అతడి స్థానంలో మెరిట్ అభ్యర్థిని నియమించారు. అదేవిధంగా టీబీ విభాగంలో సీనియర్ ట్యూబర్క్లోసెస్ ల్యాబ్ సూపర్వైజర్ పోస్టుల్లో ఇద్దరిపై ఫిర్యాదులు రాగా సర్టిఫికెట్లు పరిశీలించి వారిని తొలగించారు.
ఎంఎల్హెచ్పీల నియామకాల్లో..
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలో 140 సబ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్లలో పనిచేసేందుకు మిడ్లెవల్ నర్సింగ్ ప్రొవైడర్స్ను నియమించారు. వీరి నియామకం కోసం జీఎన్ఎం నుంచి ఎంబీబీఎస్ వరకు విద్యార్హతలు పేర్కొన్నారు. అయితే ఇందుకోసం మొత్తం 500మందికి పైగా నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. నియామకం పూర్తయిన తర్వాత 28 మంది వేరే ఉద్యోగాలు రావడంతో వెళ్లిపోయారు. ప్రస్తుతం పని చేస్తున్నవారిలో తక్కువ మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలు ఇచ్చారని జిల్లాలోని అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా పెద్దగా స్పందించలేదు. దీంతో వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడంతో అన్ని సర్టిఫికెట్లు పరిశీలించి అనర్హులపై వేటు వేయాలని ఆదేశించారు. దీంతో రెండు రోజులు గా ఎంఎల్హెచ్పీల నియామక ఫైల్ తీసి సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నారు. టెన్త్, ఇంటర్, టెక్నికల్ సర్టిఫికెట్లు, మార్కుల జాబితాను పరిశీలించి సంతకాలు తీసుకుంటున్నారు.
సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నాం..
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాలోని డిప్యూటీ డీఎంహెచ్ఓలు, డీపీఓ, ఇతర జిల్లా అధికారులు మొత్తం ఐదుగురితో కమిటీ వేసి రోజుకు 20 మంది చొప్పున అందరి సర్టిఫికెట్లు పరిశీలిస్తున్నాం. ఒరిజినల్ సర్టిఫికెట్లు పరిశీలించి జిరాక్స్ కాపీపై సదరు ఉద్యోగి సంతకం తీసుకుంటున్నాం. పరిశీలన పూర్తయిన తర్వాత జిల్లా అధికారుల సూచనతో ఉన్నతాధికారులకు తుది నివేదికను పంపిస్తాం.
– రవిరాథోడ్, డీఎంహెచ్ఓ
ఎంఎల్హెచ్పీల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్న అధికారులు
ఆరోగ్యశాఖలో గతంలో ఎస్టీఎల్ల నియామకాల్లో తేటతెల్లం
ప్రస్తుతం ఎంఎల్హెచ్పీల
భర్తీపై ఫిర్యాదులు
ఉన్నతాధికారుల ఆదేశాలతో కదిలిన ఫైల్
సర్టిఫికెట్ల పరిశీలనలో అధికారులు
అక్రమార్కుల్లో భయం..


