● కలెక్టర్ స్నేహశబరీష్
కురవి: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బోగస్ ఓటర్లు లేని ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యమని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. గురువారం మండలంలోని మొగిలిచర్ల, తాఠ్యతండాలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ నోటీసులు, వివరాల నమోదు కార్యక్రమాన్ని ఆమె స్వయంగా పరిశీలించారు. మొగిలిచర్ల పోలింగ్ బూత్ నంబర్ 60, 61, 62లలో 310 మందికి, తాఠ్యతండాలో పోలింగ్ బూత్ నంబర్ 66లో 287 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన అర్హులైన యువత నుంచి కొత్త ఓటు హక్కు నమోదుకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఓటరు వివరాల్లో తప్పుల సవరణ, నియోజకవర్గం మార్పు లేదా ఎపిక్ కార్డు మార్పుల కోసం ఫారం–8 దరఖాస్తులను పరిశీలించారు. అనర్హులు, మరణించిన లేదా శాశ్వతంగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన వారి పేర్ల తొలగింపుపై అభ్యంతరాలను పరిశీలిస్తామని తెలిపారు. బూత్ లెవల్ ఏజెంట్ల భాగస్వామ్యంతో ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కార్యక్రమలో తహసీల్దార్ విజయ, ఎంపీడీఓ వీరబాబు పాల్గొన్నారు.
భూముల పరిశీలన
కురవి: మండల కేంద్రంలో ఐకేపీ భవనం సమీపంలోని 177 సర్వే నంబర్ భూములను గురువారం అదనపు కలెక్టర్ అనిల్కుమార్ పరిశీలించారు. ఇటీవల దైద భద్రయ్య, ఇరుగు వెంకన్న తదితరులు 177 సర్వే నంబర్లోని ఫ్రభుత్వ భూములను కాపాడాలని, సమగ్ర సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు అదనపు కలెక్టర్ అనిల్కుమార్ సంఘటన స్థలానికి వచ్చి తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులు దైద భద్రయ్య, ఇరుగు వెంకన్న 177 సర్వేనంబర్లో ప్రభుత్వ భూమిని సర్వే చేసి హద్దులు పెట్టాలని సూచించారు. అలుగు, కట్ట విషయాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. గతంలో డీఐతో సర్వే చేయించామని తహసీల్దార్ విజయ అదనపు కలెక్టర్కు తెలిపారు. ఎక్కడి వరకు హద్దులు పెట్టారని అడిషనల్ కలెక్టర్ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఫిర్యాదుదారులు జోక్యం చేసుకుని 177 సర్వే నంబర్ భూమి ఎంత వరకు ఉందో అదనపు కలెక్టర్కు చూపించారు. సమగ్ర సర్వే చేస్తే నిజాలు వెల్లడవుతాయని తెలిపారు. దీంతో అనిల్కుమార్ మాట్లాడుతూ.. సర్వేయర్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో సర్వే చేసి హద్దులు నిర్ణయిస్తామని తెలిపారు.
ఫొటోగ్రాఫర్ డప్పు యానికి పురస్కారం
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్ డప్పు యానికి అమెరికా పురస్కారం లభించింది. ఏఎన్ఐయూ గిరిజనుల జీవన శైలిపై డప్పు యాని తీసిన ఫొటోలకు అమెరికాలోని ఇమేజ్ కొలీగ్ సొసైటీ అత్యున్నత, అరుదైన పురస్కారాన్ని అందజేసింది. ప్రపంచ వ్యాప్తంగా బ్రిటిష్ రాయల్ ఫొటోగ్రఫీ సొసైటీ (లండన్), ఫొటోగ్రఫీ సొసైటీ ఆఫ్ అమెరికా (అమెరికా), ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీ లా ఆర్ట్ ఫొటోగ్రఫీ (ఫ్రాన్స్)తో పాటు ఇమేజ్ కొలీగ్ సొసైటీ (అమెరికా) సంస్థలు నిర్వహించే అంతర్జాతీయ స్థాయి ఫొటోగ్రఫీ పోటీల్లో ఒడిశా రాష్ట్రంలో బొండా గిరిజనుల జీవనశైలి అంశంపై డప్పు యాని తీసిన చిత్రాలతో కూడిన డాక్యుమెంటరీకి ఏఐసీఎస్ సర్టిఫికెట్ ప్రకటించారు. ఈమేరకు ఏఐసీఎస్ హానర్ (యూఎస్ఏ) ప్రముఖ సినిమా డైరెక్టర్ బోయపాటి శ్రీను చేతుల మీదుగా డప్పు యాని అవార్డు స్వీకరించారు. ఫోటోగ్రాఫర్లు, మిత్రులు, మహబూబాబాద్ ఫొటో అండ్ వీడియో వెల్ఫేర్ అధ్యక్షుడు తోట సుభాష్, గౌరవ అధ్యక్షులు దుంపేటి లక్ష్మణ్, శంకర్, వంశీ, రాకేష్, రఘుపతి తదితరులు డప్పు యానిని అభినందించారు.


