హన్మకొండ చౌరస్తా: బంగారం తాకట్టులో ఉందని నకిలీ పత్రం సృష్టించి ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీని మోసం చేసిన నిందితులను గురువారం హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ కొత్తూరుజెండా ప్రాంతానికి చెందిన ఏలిమి సంతోష్ హనుమకొండ మిషనరీ ఆస్పత్రి పక్కన ఎటుజెడ్ కాంప్లెక్స్లో శ్రీమాన్ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ చైర్మన్గా కొనసాగుతున్నాడు. ములుగుకు చెందిన వడ్డేపల్లి రంజిత్ ఆన్లైన్ బెట్టింగ్లతో ఆర్థికంగా నష్టపోయాడు. వీరద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి సుమారు 640 గ్రాముల బంగారం శ్రీమాన్ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్లో తాకట్టులో ఉన్నట్లు చూపిస్తూ నకిలీ రసీదు తయారు చేసి నమ్మించారు. అయితే బంగారాన్ని ప్రత్యక్షంగా పరిశీలించకుండానే ఓ గోల్డ్ ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధి తన బ్యాంకు నుంచి ఆర్టీజీఎస్ ద్వారా రూ.59.30 లక్షలు శ్రీమాన్ కోఆపరేటివ్ క్రెడిట్ యూనియన్ ఖాతాకు బదిలీ చేశారు. అనంతరం నకిలీ తాకట్టు పత్రమని తెలుసుకున్న సదరు గోల్డ్ కంపెనీ ప్రతినిధులు పోలీసులకు చెబుతామని హెచ్చరించారు. దీంతో నిందితులు ఖాతాలోని నగదును ఇతర అవసరాలకు మళ్లించారు. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, ప్లెడ్జ్(తాకట్టు) కాపీని స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అంతేకాకుండా ఈ మోసంలో ఇంకెవరికై నా ప్రమేయం ఉందా, ఇదే తరహాలో ఇతర గోల్డ్ ఫైనాన్స్ సంస్థలను మోసం చేశారా అనే కోణాల్లో కూడా విచారణ చేస్తున్నట్లు తెలిపారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
వివరాలు వెల్లడించిన పోలీసులు


