గీసుకొండ : ఎయిడ్స్ నియంత్రణకు సంబంధిత శాఖల అధికారులు, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి బి. రాజారెడ్డి సూచించారు. బుధవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఐసీటీసీ సిబ్బంది మరింత చురుగ్గా పనిచేసి హెచ్ఐవీ స్క్రీనింగ్ శాతాన్ని పెంచాలని ఆదేశించారు. జిల్లాకు చెందిన హెచ్ఐవీ కేసులు ఇతర ప్రాంతాల్లో నమోదుకాకుండా గుర్తించి ఇక్కడే వైద్య సేవలు అందేలా చూడాలన్నారు. ఎన్జీఓలు ప్రజల్లో ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ఐఈసీ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. హెచ్ఐవీ నిర్ధారణ అయిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచాలని, వారికి అవసరమైన కౌన్సెలింగ్, చికిత్సను ఏఆర్టీ కేంద్రాల ద్వారా నిరంతరం అందించాలని సూచించారు. హనుమకొండ జిల్లా ప్రోగ్రాం అధికారి మధన్ మోహన్ రావు, డీపీఎం స్వప్న మాధురి, డేటా మేనేజర్ కమలాకర్, డిప్యూటీ డెమో ఎస్. వెంకటేశ్వర్లు, వివిధ ఎన్జీఓల ప్రతినిధులు, ఐసీటీసీ, ఏఆర్టీ సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ డీఎంహెచ్ఓ రాజారెడ్డి


