కాళేశ్వరం : రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ఆలయ పునర్నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. రూ.198 కోట్ల వ్యయంతో నిర్మాణాల పనులు ముమ్మరమయ్యాయి. విజయ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీశుభానందాదేవి అమ్మవార్ల ఆలయాల పునాది పనులు, ప్రాకారాల కాంక్రీట్ పనులు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన ఆలయం గర్భగుడికి పునాది కోసం 12 ఫీట్ల మేర లోతు మట్టి తీసినప్పటికీ గట్టినేల తగలలేదు. మరో రెండు ఫీట్ల మేర తవ్వినా గట్టి మట్టి రాలేదని తెలిసింది. దీనికితోడు 1978–83 మధ్య కాలంలో నిర్మించిన పాత ఆలయానికి సంబంధించిన జోడు లింగాలు (కాళేశ్వరముక్తీశ్వరుడు) పావట్టం గోడలకు ఉన్న పునాది మట్టి దక్షిణం వైపునకు కూలుతుండడంతో ఇసుకను సంచుల్లో నింపి సపోర్టుగా అమర్చారు. ఈవిషయమై అధికారులు కాంట్రాక్టర్ తీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనిపై ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు తర్జనభర్జన పడుతున్నారని సమాచారం. గట్టి మట్టి లేకపోవడంతో కాంట్రాక్టర్.. పునాది కోసం ఇసుక పోసి సిమెంట్ కాంక్రీట్తో పనులు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నిర్మాణ పనులను బుధవారం ఎస్ఈ రమేష్ బాబు, డీఈ దేవేందర్ పరిశీలించారు.


