● టీఎస్యూఈఈయూ నేతల విజ్ఞప్తి
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి కోరారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ ఉద్యోగులు, అన్మ్యాన్డ్ వర్కర్ల సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీ ఎన్పీడీసీఎల్ పరిధిలో విద్యుత్ వినియోగదారుల సంఖ్య, కొత్త కనెక్షన్లు, సెక్షన్ కార్యాలయాల పరిధి, రోజువారీ పనిభారం నిరంతరం పెరుగుతున్నా అందుకనుగుణంగా ఆపరేషన్, మెయింటెనెన్స్ సిబ్బంది సంఖ్య పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా సిబ్బంది కొరతతో పని ఒత్తిడి పెరుగుతోందన్నారు. దీనిపై స్పందించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని కోరారు. టీఎస్ఈఈయూ టీజీ ఎన్పీడీసీఎల్ అధ్యక్షుడు జి.ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి బొల్లి వెంకటరాజు, ప్రతినిధులు ఎల్.శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, కుసుమ శ్రీనివాస్, సురభి శ్రీకాంత్, రాచకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.


