వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా వెంకటాపుం(ఎం) మండలం రామప్ప దేవాలయంలోని రామలింగేశ్వరస్వామి వారికి అభిషేకం కోసం గోదావరి జలాలు అందించేందుకు అధికారులు కృషి చేస్తున్నట్లు తెలిసింది. గర్భగుడికి చెందిన సోమసూత్రం మూసుకపోవడంతో కేంద్ర పురావస్తుశాఖ అధికారులు శ్రమించి ఇటీవల పునరుద్ధరించారు. రామలింగేశ్వరస్వామి వారిని పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ ద్రవం బయటకు వెళ్లేలా మూడు ఇంచుల స్టీల్ పైపు అమర్చారు. ఈక్రమంలో అధికారులు మరో అడుగు ముందుకు వేసి గర్భగుడిలో నిరంతరం నీరు ఉండేలా బయట నుంచి పైపులను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ఒక పైపును నీటి కోసం అమర్చి గర్భగుడిలో నల్లా ఏర్పాటు చేశారు. మరో పైపును గర్భగుడిలో విద్యుత్ సౌకర్యం కోసం ఏర్పాటు చేశారు. దేవాదుల పైపులైను ద్వారా రామప్ప సరస్సులోకి గోదావరి జలాలు వస్తుండగా, ఇక్కడి నుంచి ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించడమే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలకు తాగునీటిని సైతం సరఫరా చేస్తున్నారు. గోదావరి జలాలతో రామలింగేశ్వరస్వామికి అభిషేకం చేస్తే బాగుంటుందనే ఆలోచనతో రామప్ప ఆలయం శివారు నుంచి వెళ్తున్న తాగునీటి పైపులైన్కు కనెక్షన్ ఇచ్చి గర్భగుడిలోకి ఆ నీటిని అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
స్వామివారికి అభిషేకం
చేసేందుకు నల్లా ఏర్పాటు


