● మంత్రి ధనసరి సీతక్క
కొత్తగూడ/గంగారం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా అధికారులు పని చేయాలని పంచాయతీరాజ్, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి సీతక్క సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో స్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హయాంలో రేషన్ కార్డులు ఇచ్చారని, మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగిందన్నారు. ఇచ్చిన కార్డులను స్మార్ట్గా మార్చి అందిస్తున్నట్లు వివరించారు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేని కొందరు నాయకులు చేస్తున్న విమర్శలను ప్రజలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో అన్ని అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామన్నారు. ఎల్నినో కారణంగా ఏర్పడ్డ కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్ఓ రమేష్, తెలంగాణ రాష్ట్ర రూరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సభ్యుడు చల్ల నారాయణరెడ్డి, మహిళా కమిషన్ సభ్యురాలు నునావత్ రాధ, స్థానిక సర్పంచ్ మల్లెల భాగ్యమ్మ, వివిద శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.


