న్యూస్రీల్
ఆదివారం శ్రీ 30 శ్రీ ఆగస్టు శ్రీ 2026
సాక్షి, మహబూబాబాద్/ కేసముద్రం: పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం.. మహబూబాబాద్ జిల్లా.. తొర్రూరు కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యాయి. విభజనతో పరిపాలన ప్రజలకు చేరువైంది. కానీ జిల్లాలోని కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులకు మాత్రం డివిజన్ విభజన శాపంగా మారింది. డివిజన్ మార్పుతో వందల సంవత్సరాల నుంచి సేద్యం చేసుకునే భూముల వివరాలు తారుమారయ్యాయి. దీంతో నారాయణపురం రైతులు పదేళ్లుగా ప్రభుత్వ పథకాలకు నోచుకోలేదు. దీంతో రైతులు పోరాటబాట పట్టడంతో సమస్య గ్రామం నుంచి అసెంబ్లీలో చర్చజరిగే వరకు వెళ్లింది. రైతుల పోరాటం, అధికారులు, ప్రజాప్రతినిధుల శ్రమ ఫలించింది. రైతులకు భూమి హక్కు పట్టాపాస్ పుస్తకాలు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.
డివిజన్ మార్పుతో మొదలైన సమస్య..
నారాయణపురం గ్రామం మొదట్లో నెల్లికుదురు మండలం చిన్నముప్పారం రెవెన్యూ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేది. తొర్రూరు రెవెన్యూ డివిజన్ ఏర్పడిన సమయంలో చిన్నముప్పారం గ్రామం తొర్రూరు డివిజన్లో చేరగా.. నారాయణపురం మానుకోట డివిజన్లోనే ఉండిపోయింది. దీంతో 116, 117, 145 నుంచి మొదలుకుని 185 సర్వే నంబర్ల వరకు మొత్తం 43 సర్వే నంబర్ల పరిధిలో 1,827.12 ఎకరాల భూమితో కొత్త రెవెన్యూ గ్రామం ఏర్పడింది. భూప్రక్షాళన సందర్భంగా నారాయణపురం గ్రామానికి చెందిన సర్వే నంబర్లు అన్నీ అటవీశాఖ పరిధిలో నమోదయ్యాయి. దీంతో రైతుల సమస్య మొదలైంది.
అసెంబ్లీలో చర్చ..
తాము సాగుచేసుకునే భూమి ఫారెస్టు భూమిగా నమోదు కావడంతో రైతులకు ప్రభుత్వ పథకాలు అందలేదు. రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ, చివరకు ధాన్యం కొనుగోళ్లు, యూరియా బస్తాల కూడా సబ్సిడీ పొందలేని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామంలోని నాయకులు, రైతులు మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు సమస్య చేరేలా పోరాడారు. అసెంబ్లీలో నారాయణపురం రైతుల సమస్యపై చర్చ కూడా జరిగింది. ధరణీ చట్టంలోని లొసుగు ప్రస్తావన, భూ భారతి ఏర్పాటు విషయంలో నారాయణపురం రైతుల సమస్యను కూడా పరిగణలోకి తీసుకొని చట్టం చేసినట్లు సీఎం, మంత్రులు బహిరంగంగా చెప్పడం గమనార్హం.
ఎట్టకేలకు సమస్య పరిష్కారం
దశాబ్దాల తరబడి ప్రభుత్వ పథకాలు అందక గోసపడ్డ నారాయణపురం రైతులు సంతోషంగా నవ్వే రోజు ఆసన్నమైంది. గ్రామంలో 43 సర్వే నంబర్లు, 1,827.12 ఎకరాల భూమి ఉంది. అయితే గత ప్రభుత్వం రైతులకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా.. భూమి, సర్వే నంబర్ల మధ్య తేడా ఉండటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. భూ భారతి చట్టం వచ్చిన తర్వాత సర్వే అండ్ బౌండ్రీస్ 1923 చట్టం ప్రకారం రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేసి 160రోజులు సర్వే చేశారు. దీంతో 780 మంది రైతులకు చెందిన 1,468 ఎకరాల భూమి ఏ అడ్డంకులు లేకుండా ఉన్నట్లు తేలింది. దీంతో ఈనెల 31న సంబంధిత రైతులకు పట్టాలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన 129 మంది రైతులకు చెందిన 149 ఎకరాల భూమి సర్వే నంబర్ 117లో ఉంది. ఈ నంబర్ ఫారెస్టు భూమిలో చూపిస్తుంది. అయితే అటవీశాఖతో సంప్రదింపులు జరిపి అది కూడా త్వరలో పరిష్కారం చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
దశాబ్దా భూ సమస్యకు పరిష్కారం
అర్హులకు పట్టాల పంపిణీకి సిద్ధం
గతంలో డివిజన్ విభజనతో
రైతుల రికార్డుల తారుమారు
స్వరాష్ట్రంలో పథకాలకు నోచుకోని రైతులు
పట్టాలు వస్తుండడంతో హర్షం


