కేసముద్రం: మండలంలోని అర్పనపల్లి గ్రామ శివారు ఓ రైతుకు చెందిన పంటపొలంలో పడిన పాదముద్రలు పులివి కావని, అడవి పెద్ద పిల్లివిగా ప్రాథమికంగా గుర్తించినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. గ్రామానికి చెందిన గండికోట కుమార్ అనే రైతు సోమవారం సాయంత్రం తన వ్యవసాయ బావి వద్ద కట్టేసిన కుక్కను ఇంటికి తీసుకురావడానికి వెళ్లగా.. పులి కనిపించిందంటూ గ్రామస్తులకు తెలపడం, పంట పొలంలో పడిన పాదముద్రలను సెల్ఫోన్లో ఫొటోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేయడంతో గ్రామశివారులో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయం ఫారెస్టు అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఎఫ్ఆర్వో సురేష్ ఆదేశాల మేరకు నాయక్పల్లి, నాగారం, గాజులగట్టు ఫారెస్టు బీట్ ఆఫీసర్లు యాకూబ్, నరేందర్, సురేష్ మంగళవారం అర్పనపల్లి గ్రామాన్ని సందర్శించారు. పంట పొలంలో పాదముద్రలను పరిశీలించి, వాటి నమూనాలను సేకరించారు. అయితే ఆ పాదముద్రలు పులివి కాదని, అడవి పెద్ద పిల్లివిగా గుర్తించినట్లు ఎఫ్ఆర్వో సురేష్ తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళన చెందవద్దని ఆయన తెలిపారు.
అర్పనపల్లిలో పాదముద్రలను పరిశీలించిన ఫారెస్టు అధికారులు


