కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీలో నేటినుంచి ఈ నెల 22 వరకు ఏఐ అండ్ మాలిక్యూలర్ మోడలింగ్పై వర్క్షాప్ నిర్వహించనున్నారు. కేయూలోని సెంటర్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటిక్స్అండ్ అలైడ్ డిసిప్లిన్స్ ఆధ్వర్యంలో అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ అండ్ మాలిక్యూలర్ మోడలింగ్ టూల్స్ ఇన్ డ్రగ్ డిస్కవరీ యూజింగ్ మోల్సాఫ్ట్ అనే అంశంపై వారం రోజులపాటు వర్క్షాప్ ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అడ్వెంట్ ఇన్ఫర్మాటిక్స్, మోల్సాఫ్ట్ ఎల్ఎల్సీ ఇండియా వ్యవస్థాపకుడు సీఈఓ అధీకృత ప్రతినిధి సురోజిత్సాధు కీలకోపన్యాసం చేయనున్నారని ఈ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఎన్.ప్రసాద్, అదనపు కోఆర్డినేటర్ డాక్టర్ టి.శాస్త్రి ఆదివారం తెలిపారు.
చర్లపల్లి–గోరఖ్పూర్ మధ్య అమృత్భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్
● అక్టోబర్ 2నుంచి అమలు
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణ–గోరఖ్పూర్ నగరాలను అనుసంధానం చేస్తూ ప్రయాణికుల రవాణా కోసం నాన్ ఏసీ సూపర్ఫాస్ట్ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ను ప్రవేశపెట్టి నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ ఆదివారం తెలిపారు.
అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వివరాలు..
అక్టోబర్ 2వ తేదీన చర్లపల్లి–గోరఖ్పూర్ (22075) వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు చర్లపల్లిలో ప్రతి శనివారం 21:45 గంటలకు బయలుదేరి కాజీపేట జంక్షన్కు 23:28 గంటలకు చేరుకొని ఆదివారం 6:25 గంటలకు గోరఖ్పూర్కు చేరుతుంది. అదేవిధంగా అక్టోబర్ 4వ తేదీన ప్రతి ఆదివారం బయలుదేరే గోరఖ్పూర్–చర్లపల్లి (22076) అమృత్భారత్ ఎక్స్ప్రెస్ రైలు గోరఖ్పూర్లో 8:30 గంటలకు బయలుదేరి కాజీపేట జక్షన్కు సోమవారం 12:58 గంటలకు చేరుకొని 15:00 గంటలకు చర్లపల్లికి చేరుతుంది. స్లీపర్ అండ్ అన్ రిజర్వుడ్ కోచ్లతో ఉన్న సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్లార్షా, చంద్రాపూర్, నాగపూర్ జంక్షన్, బేతుల్, ఇటార్సీ జంక్షన్, భోపాల్ జంక్షన్, బీనా జంక్షన్, వీజీఎల్ ఝాన్సీ జంక్షన్, ఓరా, పొక్రాయన్, కాన్పూర్ సెంట్రల్, ఆషీబాగ్, లక్నో సిటీ, గోమిత్ నగర్, బరాబంకి జంక్షన్లో హాల్టింగ్ కల్పించారు.
అత్యవసర విభాగంలో తప్పని క్యూ
కాశిబుగ్గ: వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రక్త పరీక్షల కోసం పేషెంట్లు, అటెండెంట్లు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆదివారం అత్యవసర విభాగంలో బ్లడ్ టెస్టులు చేయించుకునేందుకు రోగులు క్యూ కడుతున్నారు. క్యాజువాలిటీలో చికిత్స కోసం వచ్చిన పేషెంట్లు, వార్డుల్లో అడ్మిట్ అయిన పేషెంట్ల అటెండెంట్లు రక్త నమూనాలు పట్టుకుని గంటల తరబడి క్యూ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఆదివారం ఓపీలు బంద్ కావడం వల్ల సెంట్రల్ ల్యాబ్ బంద్ చేస్తున్న నేపథ్యంలో.. రక్త పరీక్షల తాకిడి ఎక్కువై ల్యాబ్ సిబ్బందిపై భారం పడుతోంది. వాస్తవానికి ఒక్కో షిప్టులో ఆరుగురు సిబ్బంది ఉండాలి. కానీ, కేవలం ముగ్గురితోనే నడిపిస్తున్నారు. దీంతో ముగ్గురిపై ఒత్తిడి పెరిగి సకాలంలో రక్త పరీక్షలు చేసి, రిపోర్ట్ ఇవ్వడం సమస్యగా మారుతోంది. రక్త పరీక్షల నిర్వహణ కోసం ఆదివారం అదనంగా సిబ్బంది నియమించాలని పేషెంట్లు కోరుతున్నారు. దూర ప్రాంతాల నుంచి ఆపదలో వచ్చిన తాము అవస్థలు పడాల్సి వస్తోందని రోగులు వాపోతున్నారు. అదేవిధంగా బ్లడ్ రిపోర్టులు తొందరగా కావాలంటే ప్రైవేట్కు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు.


