● కాటమయ్య గుండుపై అయ్యదేవుడు
భీమదేవరపల్లి : హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో ఇటీవల కల్యాణి చాళుక్యుల శాసనాన్ని గుర్తించిన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు గుడికందుల కిశోర్, సిద్దమల్ల రమేశ్ మరో చారిత్రక శిల్పాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. చాళుక్యుల శాసనం పరుపు బండపై ఉండగా దీనికి ఎదురుగా ఒక పెద్ద రాతిగుండు ఉంది. దీన్ని స్థానికులు కాటమయ్య గుండుగా పిలుస్తారు. ఈ గుండుకు ఉత్తరాభిముఖంగా మూడు అర్థ శిల్పాలున్నాయి. వాటిలో గుర్రాన్నెక్కి కుడిచేత చెంటూ ఆయుధాన్ని భుజంపై పెట్టుకుని ఎడమ చేత కళ్లెం పట్టుకున్న అయ్యదేవుడిని స్థానికులు కాటమరాజుగా పిలుస్తున్నారు. అతడి గుర్రం ఎదుట ఒక కుక్క ఉంది. గ్రామాలను రక్షించే అయ్యదేవుళ్లను ఒక్కొ ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో కాటమయ్య అని పిలువగా మరికొన్ని ప్రాంతాల్లో కాటమరాజుగా పిలుస్తారు. ఈ శిల్పాలు కల్యాణి చాళుక్యుల కాలానికి దగ్గరగా ఉన్నాయని, అయితే ఇవి ఎక్కువగా స్థానికంగా చేయించినవి కావడం వల్ల భిన్నమైన శైలిలో ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం అధ్యక్షుడు శ్రీరామోజు హరగోపాల్ స్పష్టం చేశారు. అయ్యదేవుడి వెనుక భాగాన చేతుల్లో పూజాద్రవ్యాలతో ఒక సీ్త్ర శిల్పం ఉంది. అయ్యదేవుడు కొన్ని సార్లు దేవేరితో కనిపిస్తాడని, ఇక్కడ పూర్తి భిన్నంగా ఉన్నాడని తెలిపారు. స్థానికులు ఈ ప్రాంతంలో ఒక ముఠాగా ఏర్పడి ఇటీవల డిటెక్టర్ సాయంతో తవ్వకాలు జరిపారని స్థానికులు వెల్లడించారు.


