● ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి
హసన్పర్తి : పోటీ ప్రపంచంలో విద్యార్థినులు సాంకేతిక పరిజ్ఞానంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అన్నాసాగరంలోని సుమతిరెడ్డి మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్లో ప్రవేశం పొందిన విద్యార్థినులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థి జీవితంలో ఇంజనీరింగ్ విద్య ఎంతో కీలకమన్నారు. విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వపు లక్షణాలు, సమయపాలనను అలవర్చుకోవాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి మాట్లాడుతూ.. పాఠశాల విద్యకు కళాశాల విద్యకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నారు. తొలుత జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డాక్టర్ శ్రీనివాస్, సుదర్శన్, కుమారస్వామి, ప్రశాంత్, ఏఓ స్వాతి, అధ్యాపకులు పాల్గొన్నారు.
శేషుకుమార్ హత్య కేసు నిందితుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన సీఐ సూర్యప్రకాశ్
ఏటూరునాగారం : మంగపేట మండలం కమలాపురం గ్రామంలో ఈనెల 12న జరిగిన తాటి శేషుకుమార్ హత్య కేసులో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏటూరునాగారం సీఐ జీడి సూర్యప్రకాశ్ తెలిపారు. శుక్రవారం ఏటూరునాగారం పోలీస్స్టేషన్లో నిందితుల అరెస్టు వివరాలను మీడియాకు వెల్లడించారు. పూరేడుపల్లికి చెందిన కొప్పుల నర్సింగరావు, అతడి భార్య లక్ష్మి, గొందిగూడెం గ్రామానికి చెందిన తాటి శేషుకుమార్ కలిసి కమలాపురం శివారులోని పుల్లంశెట్టి శ్యామ్కుమార్ వ్యవసాయ భూమిలో పనుల కోసం ముగ్గురు కలిసి పాకలో ఉంటున్నారు. శేషుకుమార్ వారంరోజుల నుంచి నర్సింగరావు భార్య లక్ష్మితో అనుచితంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. ఇదే విషయంలో పద్ధతి మార్చుకోవాలని భార్యభర్తలు శేషును మందలించారు. అయినా అతడిలో మార్పు రాకపోవడంతో పాటు ఈనెల 12న మళ్లీ నర్సింగరావు, లక్ష్మితో గొడవపడ్డాడు. విసుగుచెందిన నర్సింగరావు భార్య లక్ష్మితో కలిసి శేషు పడుకొని ఉండగా గొడ్డలితో దాడిచేసి హత్య చేశారని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా ఈనెల 13న కమలాపురం శివారులో హనుమకొండకు వెళ్లే క్రమంలో నమ్మదగిన సమాచారం మేరకు వారిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారించగా నేరం చేసినట్లు వారు ఒప్పుకున్నట్లు సీఐ వివరించారు. కేసును త్వరగా చేధించిన మంగపేట ఎస్సై టీవీఆర్ సూరి, సిబ్బందిని సీఐ అభినందించారు.


