స్టేషన్ఘన్పూర్ : ప్రస్తుత పరిస్థితుల్లో దేవాదుల ఎత్తిపోతల పథకం ఉమ్మడి వరంగల్ జిల్లాకు వరప్రదాయినిగా మారిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్ఘన్పూర్, చిల్పూరు మండలాల పరిధిలోని మల్లన్నగండి రిజర్వాయర్ కుడికాల్వ ద్వారా శుక్రవారం పంట కాల్వలకు నీటిపారుదల శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ధర్మసాగర్, స్టేషన్ఘన్పూర్, మల్లన్నగండి, అశ్వరావుపల్లి, నవాబుపేటతో పాటు బొమ్మకూరు, చీటకోడూరు రిజర్వాయర్ల ద్వారా స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు సాధ్యమైనంతవరకు సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు నుంచి కూడా సాగునీరు విడుదల చేయడం లేదని, కేవలం దేవాదుల ప్రాజెక్టు నుంచి మాత్రమే పంటలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. రిజర్వాయర్లలో 50శాతం వరకు నీటినిల్వలు ఉన్నాయని, ఆన్అండ్ఆఫ్ పద్ధతిలో సాగునీటి విడుదల చేస్తామని పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకుని పంటలను కాపాడుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ జూలుకుంట్ల లావణ్యశిరీష్రెడ్డి, నాయకులు రాపోలు మధుసూదన్రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి
మల్లన్నగండి రిజర్వాయర్ నుంచి
సాగునీరు విడుదల


