● కలెక్టర్ స్నేహశబరీష్
మహబూబాబాద్: జిల్లాలో భూముల రీసర్వేను వేగవంతం చేయాలని కలెక్టర్ స్నేహశబరీష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం భూముల సమగ్ర రీ సర్వేపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్వే పూర్తి చేసిన తర్వాత రూపొందించిన తాత్కాలిక మ్యాప్లు, రికార్డులు గ్రామంలో ప్రదర్శించాలన్నారు. ప్రతీ భూ కమతానికి కచ్చితమైన డిజిటల్ మ్యాప్తో పాటు ప్రత్యేకమైన భూధార్ సంఖ్య కేటాయిస్తామన్నారు. నిజాంకాలం నాటి రికార్డుల స్థానంలో నూతన డిజిటల్ రికార్డులు రావడం వల్ల భవిష్యత్లో సరిహద్దుల తగాదాలు ఉత్పన్నం కావన్నారు. గ్రామ, మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యమన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, సంబంఽధిత అధికారులు పాల్గొన్నారు.
ఉత్తమ సేవలు అందించాలి
అధికారులు విధుల్లో ఉత్తమ సేవలు అందిస్తే ప్రజలు మర్చిపోరని కలెక్టర్ స్నేహశబరీష్ అన్నారు. కలెక్టరేట్లో గురువారం జిల్లాలో పెండింగ్లో ఉన్న కారుణ్య నియామకాల ప్రక్రియ పూర్తి చేసి, అర్హులైన 16 మంది అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కష్ట సమయంలో ఉన్న ఉద్యోగుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అధికారులంతా జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అనిల్కుమార్, డీఆర్వో నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


