● ఎస్పీ శబరీష్
మహబూబాబాద్ రూరల్: పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, ప్రజా భద్రతకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఎస్పీ శబరీష్ అన్నారు. మహబూబా బాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు స్టేషన్ల వారీగా నేరాల పరిస్థితి, కేసుల దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, పోలీసు అధికారుల పనితీరుపై సమీక్షించారు. గ్రేవ్ కేసులు, యూఐ కేసులు, ప్రాపర్టీ నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు, మహిళలు, చిన్నారులపై నేరాల దర్యాప్తును వేగవంతం చేసి పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. ఐడీ లిక్కర్, ఐఎంఎఫ్ఎల్, ఎన్డీపీఎస్, నల్లబెల్లం, పీడీఎస్ బియ్యం, ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలు, సకాలంలో సమన్లు జారీ, హిస్టరీ షీట్ల అప్డేట్, నేరస్తుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగించాలని ఆదేశించారు. జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయాలు, అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగించాలని, గుడుంబా తయారీ కేంద్రాలు, అనుమానాస్పద ప్రాంతాలు, శివారు ప్రాంతాల్లో తరచూ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించాలని, తయారీదారులు, విక్రయదారులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. జిల్లాలో మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా, సరఫరాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. కేసుల దర్యాప్తుతో పాటు న్యాయస్థానాల్లో సమర్థవంతమైన సమన్వయం, ప్రాసిక్యూషన్ బాధ్యులకు సహకారం అందిస్తూ నిందితులకు శిక్షలుపడేలా కృషి చేసిన కోర్టు డ్యూటీ అధికారులను ఎస్పీ అభినందించి ప్రశంసపత్రాలను అందజేశారు.


