దంపతులకు చెట్ల ఆకులు, పూలతో పెళ్లి జరిపించిన ఉపాధి కూలీలు
జఫర్గఢ్: ఉపాధి హామీ పనుల్లో కూలీలు.. దంపతులకు పెళ్లి జరిపించారు. ఈ ఆసక్తికర ఘటన జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లిలో చోటు చేసుకుంది. కొద్ది రోజులుగా ఉపాధి పథకంలో భాగంగా గ్రామ చెరువు పూడికతీత పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఉదయం పనికి వెళ్లిన కూలీలు విరామ సమయంలో చెట్ల కింద సేదదీరుతున్నారు. ఈ సమయంలో సోషల్ మీడియాలో వచ్చిన ఉపాధి పనుల్లో జరిగిన పెళ్లి వేడుకలను చూశారు. అనంతరం తమ సహచర కూలీలైన మాచర్ల కొమురయ్య సుభద్ర దంపతులకు పెళ్లి జరిపించారు. కూలీలు పూజారిగా గాను, కు టుంబ పెద్దలుగా వ్యవహరించి పూలు, చెట్ల ఆ కులతో దంపతులను ముస్తాబు చేసి వివాహం జరిపించారు. ఆకులతో తయారు చేసిన పుస్తెల తాడు కట్టించడం, తలంబ్రాలు పోయించడం, పూలదండలు వేయించడం వంటి తంతు జరిపించారు. అనంతరం పెళ్లి జరిపించిన పెద్దల పాదాలకు దంపతులు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన కూలీలతోపాటు గ్రామస్తులకు ఆనందం కలిగించింది.


