హన్మకొండ కల్చరల్ : త్వరలో దేవాదాయశాఖ కార్యాలయాలు, దేవాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్ ఎం. హనుమంతరావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక దేవాలయాల్లో పాచిక, పరిచారిక, అర్చక పోస్టులను వేదపండితుల ద్వారా పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ నాయకులు హైదరాబాద్లో కమిషనర్ హనుమంతరావును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వివిధ దేవాలయాల్లో పనిచేస్తూ చనిపోయిన ఉద్యోగుల, అర్చకుల పిల్లలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, వారిని గ్రాంట్ ఇన్ ఎయిడ్లో చేర్చాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపించాలని తెలంగాణ అర్చక ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ, రాష్ట్ర కన్వీనర్ పరాశరం రవీంద్రాచారి, జేఏసీ నాయకులు కోరారు. దీనికి కమిషనర్ హనుమంతరావు స్పందిస్తూ మంత్రులు కొండా సురేఖ, భట్టి విక్రమార్కలకు పంపించామని, అలాగే అర్చకుల ప్రమోషన్ల విషయమై వారంలో సమావేశం ఏర్పాటు చేసి 888 జీఓ ప్రకారంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. క్యాండర్ స్ట్రెంత్ ప్రకారం దేవాదాయశాఖ కార్యాలయాల్లో పోస్టులు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అగ్నిహోత్రం చంద్రశేఖరశర్మ, వరంగల్ జిల్లా జేఏసీ కన్వీనర్ పాతర్లపాటి నరేశ్శర్మ, రాష్ట్ర కన్వీనర్ గంగు సత్యమూర్తి, కాండూరి కృష్ణమాచారి, ధనుంజయ్శర్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్ను కలిసి అర్చక ఉద్యోగుల సమస్యలు వివరించారు.
ప్రతీ కలెక్టరేట్లో దేవాదాయశాఖ చాంబర్ ఏర్పాటు
రాష్ట్ర దేవాదాయధర్మాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు


