ఫార్మసీ కళాశాల
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని ఫార్మసీ కళాశాల గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ముగింపు సమావేశాలు ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కేయూలో ఫార్మసీ కళాశాల ఏర్పాటై 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది సెప్టెంబర్ 4న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు ప్రారంభించారు. ఈఫార్మసీ కళాశాలలో చదువుకున్న ఎంతోమంది పూర్వ విద్యార్థులు దేశ, విదేశాల్లో స్థిరపడ్డారు. అందుకే సెప్టెంబర్ 12,13 తేదీల్లో అమెరికాలోని అట్లాంటాలో కూడా గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. అలాగే, అక్టోబర్11,12 తేదీల్లో హైదరాబాద్లోని కేయూ ఫార్మసీ పూర్వ విద్యార్థులు గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఈ ఉత్సవాల ముగింపు సమావేశాలు హనుమకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు.
940 మంది వరకు రిజిస్ట్రేషన్..
కేయూ ఫార్మసీ కళాశాల గోల్డెన్జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాలకు దేశ, విదేశాల నుంచి కొందరు పూర్వ విద్యార్థులు తరలిరానున్నారు. మొత్తం 940మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు ఆర్గనైజింగ్ కమిటీ గౌరవ చైర్మన్గా వి. మల్లారెడ్డి, చైర్మన్గా వి. కిషన్, ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థి, ప్రవాస భారతీయుడు సాంబారెడ్డి కన్వీనర్గా, కో కన్వీనర్గా ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్య, అధ్యక్షురాలిగా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ జె. కృష్ణవేణి వ్యవహరిస్తున్నారు.
రెండురోజుల కార్యక్రమాలు ఇలా ..
ఈనెల 27, 28వ తేదీల్లో జరిగే కేయూ ఫార్మసీ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ముగింపు సమావేశాల కార్యక్రమాలు ఇలా ఉన్నాయి. 27న ప్రారంభోత్సవ సమావేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హైదరాబాద్లోని అరబిందో ఫార్మా లిమిటెడ్ డైరెక్టర్ ఎం. మదన్ మోహన్రెడ్డి, గౌరవ అతిథిగా అమెరికా టెక్సాస్లోని ఎఅండ్ఎం యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఫార్మసీ డీన్ మన్సూర్ ఖాన్ , చీఫ్ ప్యాట్రన్గా కేయూ వీసీ కె. ప్రతాప్రెడ్డి, ప్యాట్రన్గా రిజిస్ట్రార్ వి. రామచంద్రం పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం విశ్రాంత ఆచార్యులు, ఉద్యోగులకు సన్మానం కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 4: 30 నుంచి 5గంటల వరకు ఫొటో సెషన్ ఉంటుంది. 5:30 నుంచి రాత్రి 7:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈనెల 28న ఉదయం9: 30 గంటల నుంచి పూర్వ విద్యార్థుల సమావేశం, మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1:30 గంటల వరకు ముగింపు సమావేశం ఉంటుంది. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కేయూ గెస్ట్హౌస్లో తేనీటి విందు ఉంటుంది.
27, 28వ తేదీల్లో కాళోజీ కళాక్షేత్రంలో
సమావేశాలు
తరలిరానున్న పూర్వ విద్యార్థులు


