నీరవ్వమంటే రైతులను చులకన చేస్తూ మాట్లాడారు
జనగామ రూరల్ : దేవాదుల ద్వారా సాగు నీరు విడుదల చేసి చెరువులను నింపాలని ఇరిగేషన్ అధికారులను వేడుకుంటే రైతులను చులకన చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఈఈ మంగీలాల్పై రైతులు భగ్గుమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జోరు వర్షాలు కురుస్తూ.. వాగులు, చెరువులు పొంగిపొర్లుతుంటే జనగామ మండల రైతులు మాత్రం తమకు దేవాదుల ద్వారా సాగునీరు విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. ఓబు ల్కేశ్వాపూర్, పెద్దపహాడ్, పెద్దరామన్చర్ల, పసరమడ్ల, చౌదర్పల్లి, ఎల్లంల, పెంబర్తి, శామీర్పేట, సిద్దెంకి, ఎర్రగుంట తండాకు చెందిన వందలాది మంది రైతులు ఆందోళన చేపట్టారు. వారి కథనం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఈఈ మంగీలాల్ వద్దకు వచ్చి కాళ్లు మొక్కుతాం సాగుకు నీరు విడుదల చేయాలని కోరితే నవ్వుతూ తమాషాగా మాట్లాడారని తెలిపారు. సుమారు 10 గ్రామాల పరిధిలో 4,500 పైగా ఎకరాల్లో వరి, 1,300 పైగా ఎకరాల్లో పత్తి సాగు చేయగా, ఒక్క చెరువులో కూడా నీరు లేదన్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో నేల తడవడం తప్ప కుంటలో చుక్క నీరు రాలేదన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత వరి, పత్తి పంటలను కాపాడుకునేందుకు చెరువులు నింపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ క్రమంలో నెలరోజుల నుంచి సాగు నీరు విడుదల చేయాలని ఇరిగేషన్ అధికారులను వేడుకుంటున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు పది గ్రామాల రైతులు కలిసి ఈఈ వద్దకు వస్తే దిక్కున్న చోట చెప్పుకో.. అవసరమైతే మంత్రి, సీఎం వద్దకు వెళ్లండంటూ తమపై దురుసుగా ప్రవర్తించారని, ఈ విషయంపై ప్రభుత్వం విచారణ జరిపించి ఆ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తూ సెక్షన్ ఆఫీసర్కు వినతిపత్రి అందించారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు వచ్చి రైతులను బుజ్జగించి రాస్తారోకోను విరమింపజేశారు. కాగా, ఏకంగా పది గ్రామాల రైతులు సాగునీటి కోసం ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో రైతులు జానెపల్లి జనార్దన్రెడ్డి, బడికె కిష్టస్వామి, ధర్మజయప్రకాశ్రెడ్డి, దూసరి ఉప్పలయ్య, వల్లాల మల్లేశం, కొప్పుల మధు, కొమ్ము జగదీశ్, మహేందర్ రెడ్డి, రావుల శ్రీనివాస్రెడ్డి, తదితర రైతులు పాల్గొన్నారు.
పిచ్చి కుక్క దాడిలో పలువురికి గాయాలు
కాజీపేట: హనుమకొండ జిల్లా కాజీపేటలోని 63వ డివిజన్లో బుధవారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి పలువురిని తీవ్రంగా గాయపర్చింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. బాపూజీనగర్, జూబ్లీమార్కెట్, విద్యానగర్ కాలనీ ప్రాంతాల్లో ఓ వీధి కుక్క ఒక్కసారిగా బాటసారులపై పడి కనిపించిన వాళ్లను కనిపించినట్లు గాయపర్చింది. ఇంట్లో ఆడుకుంటున్న రెండున్నర సంవత్సరాల బాలికను ఇష్టారీతిగా కరిచింది. వీరితో పాటు ఐదుగురు వ్యక్తులపై దాడి చేసింది. ఆ కుక్కను స్థానిక యువకులు కర్రలతో దాడిచేసి చంపేశారు. గాయపడిన బాధితులు సోమిడి అర్బన్ హెల్త్ సెంటర్కు వెళ్లి చికిత్స చేయించుకున్నారు.
కాళ్లు మొక్కుతామంటే నవ్వుతున్నాడు
జనగామ, నర్మెట రహదారిపై రాస్తారోకో
సాగుకు నీరు విడుదల చేయాలని డిమాండ్
ఈఈ మంగీలాల్పై రైతుల భగ్గు..