
కొనుగోలు కేంద్రాల బాట
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలో యాసంగిలో భారీగా ధాన్యం దిగుబడి వచ్చింది. సన్న ధాన్యానికి ప్రభుత్వం బోనస్ చెల్లించడం, బహిరంగ మా ర్కెట్లో ఆ ధాన్యం కొనేందుకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించేందుకు రైతులు పోటీ పడ్డారు. అంచనాకు మించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రావడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
అంచనాలకు మించి ధాన్యం
యాసంగిలో 1,36,236 ఎకరాల్లో రైతులు వరి సాగుచేశారు. 2,63,577 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఇందులో ప్రైవేట్ అమ్మకాలు, ఇతర అవసరాలకు రైతుల నిల్వ పోనూ.. కొనుగోలు కేంద్రాలకు 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. అయితే సన్న ధాన్యం క్వింటాకు బోనస్తో కలుపుకొని రూ.2,820 చెల్లించడంతో అందరు కొనుగోలు కేంద్రాలకే రావడం మొదలు పెట్టారు. దీనికి తోడు దిగుబడి అంచనా కూడా పెరడగంతో ఇప్పటికే 1.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చిందని అంచనా.. ఇంకా వస్తూనే ఉందని కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో గతంలో రోజుకు వెయ్యి, రెండు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పెట్టగా.. ఇప్పుడు ఆరు, ఏడు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కాంటాలు పెట్టి మిల్లులకు పంపించేందుకు సిద్ధంగా ఉంచుతున్నారు.
గన్నీలు, లారీల కొరత
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం ఎక్కువగా రావడంతో అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.79లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 44.75లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా జిల్లాలో 17లక్షలు కొత్తవి, 8లక్షలు పాత గన్నీ బ్యాగులు సిద్ధం చేశారు. వీటిని కొనుగోలు కేంద్రాలకు సరఫరా చేశారు. అయితే ఇప్పటి వరకు 53వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 14వేల గన్నీబ్యాగుల్లో ధాన్యం కాంటాపెట్టి మిల్లులకు పంపించారు. మిగిలిన 12వేల గన్నీబ్యాగుల్లో సగానికి పైగా ధాన్యం నింపి తూకం వేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం నింపేందుకు కొన్ని చోట్ల బస్తాలు లేక వారం రోజులుగా ఎదురుచూస్తున్నారు. దీంతోపాటు ఎనిమిది వేల పాత గన్నీబస్తాల్లో కొన్ని చినిగినవి, రంధ్రాలు పడినవి ఉండటంతో పాత బస్తాల్లో తెచ్చిన ధాన్యాన్ని పలువురు మిల్లర్లు దించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఆరు రూట్లకు లారీల సరఫరాకు టెండర్లు వేశారు. వారు 150కి పైగాలారీలు, డీసీఎంలు పెట్టినా కొనుగోళ్లకు సరిపడా లారీలు అందడం లేదు. దీంతో కాంటాలు పెట్టి మిల్లుకు పంపేందుకు లారీలు రాక వారాల తరబడి రైతులు కొనుగోలు కేంద్రాల్లో నిరీక్షించాల్సి వస్తోంది.
జిల్లాలో భారీగా ధాన్యం దిగుబడి
బోనస్ ఇవ్వడంతో కొనుగోలు
కేంద్రాలకు అధికంగా సన్నధాన్యం రాక
అధికారుల అంచనాలకు
మించి రైతుల తరలింపు
గన్నీ సంచులు,
లారీల కొరతతో సతమతం
అన్నదాతలకు తప్పని తిప్పలు
జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోళ్ల వివరాలు
సాగు విస్తీర్ణం :
1,36,236 ఎకరాలు
దిగుబడి అంచనా :
2,63,577 మెట్రిక్ టన్నులు
కొనుగోలు లక్ష్యం :
1.79 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు కేంద్రాలకు వచ్చిన
ధాన్యం అంచనా :
1.50 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం :
53 వేల మెట్రిక్ టన్నులు