
వెక్కిరిస్తున్న శిలాఫలకం
గార్ల: గార్ల పట్టణ సమీపంలో పాకాల ఏరు ఏటా వానాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయి. అయితే ఆయా గ్రామాల విద్యార్థులు, ప్రజలు రైల్వే ట్రాక్ బ్రిడ్జి వెంబడి, చెక్డ్యామ్ మీదుగా గార్లకు చేరుకుంటారు. ఈక్రమంలో ప్రమాదాలు జరిగి మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. దీంతో ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు ఆందోళనలు చేపట్టారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు అప్పటి ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాటి సీఎం కేసీఆర్తో బ్రిడ్జి నిర్మాణ గురించి మాట్లాడారు. దీంతో ఆయన రూ.15 కోట్లు నిధులు కేటా యించగా, అట్టహాసంగా బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తర్వాత ప్రభుత్వం మార డంతో మళ్లీ మొదటికొచ్చింది.
ఏటా మూడు నెలలు ఇబ్బంది..
ఏటా వానాకాలంలో పాకాల ఏరు మూడు నెలల పాటు చెక్డ్యామ్ పైనుంచి పొంగిపొర్లుతుంది. దీంతో రాంపురం, మద్దివంచ పంచాయతీల ప్రజలు, పాఠశాల విద్యార్థులు మండల కేంద్రమైన గార్లకు బయ్యారం, డోర్నకల్ మండలాల మీదుగా చుట్టూ తిరిగి వస్తారు. కొంతమంది విద్యార్థులు రైల్వే బ్రిడ్జి పైనుంచి భయంతో నడుచుకుంటూ గార్లకు వస్తుంటారు. అలాగే ఏటి చెక్డ్యామ్ కమ్ రోడ్డు దాడుతూ వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. దీంతో పదుల సంఖ్యలో ఏటిలో పడి మృతి చెందారు. కాగా బ్రిడ్జి నిర్మాణం చేపడితే సౌకర్యవంతంగా ఉంటుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
ప్రభుత్వం మారడంతో..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పాకాల ఏటిపై బ్రిడ్జి నిర్మాణ ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుత ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గత ప్రభుత్వం కేటాయించిన రూ.15 కోట్ల నిధుల విషయంపై సంబంధిత రాష్ట్ర మంత్రి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది.
ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలి
పాకాల ఏటిపై లోలెవెల్ చెక్డ్యామ్ నిర్మించడం వల్ల ఏటా వర్షాకాలంలో 3 నెలల పాటు ఇబ్బందులు పడుతున్నాం. విద్యార్థులు, ప్రజలు రైల్వేబ్రిడ్జి వెంట నడిచి గార్లకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు తప్పడం లేదు. హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టేందుకు ప్రజాప్రతినిధులు కృషిచేయాలి.
– కట్టెబోయిన శ్రీనివాసరావు,
మద్దివంచ గ్రామం
పాకాల ఏటిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం
పట్టించుకోని అధికారులు, పాలకులు
వానాకాలంలో రహదారి లేక
ప్రజల ఇబ్బందులు
చెక్డ్యామ్ దాటుతూ
ప్రాణాలు కోల్పోయిన పలువురు

వెక్కిరిస్తున్న శిలాఫలకం