గంజాయితో పట్టుబడిన ఇద్దరి అరెస్ట్‌

నిందితుల అరెస్ట్‌ చూపుతున్న పోలీసులు - Sakshi

పరారీలో ఒకరు

కాజీపేట: కాజీపేటలో సోమవారం 2.100 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్‌ చేసినట్లు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీ జితేందర్‌రెడ్డి తెలిపారు. కాజీపేట టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పట్టణానికి చెందిన మహూద్‌ నజీమ్‌, జమ్మికుంటకు చెందిన పాకాల విక్రత్‌రెడ్డి, సాహెబ్‌ గంజాయితో పట్టుబడ్డారు. వీరిలో విక్రత్‌రెడ్డి, నజీమ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. సాహెబ్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి గంజాయితో పాటు సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీఐలు కె.శ్రీనివాస్‌రావు, ఎన్‌.వెంకటేశ్వర్లు, ఎస్సైలు లవన్‌కుమార్‌, ప్రమోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అక్కను కొట్టిన తమ్ముడిపై కేసు

ఖిలా వరంగల్‌: వారసత్వంగా వచ్చే ఆస్తి విషయంలో అక్కను కొట్టిన తమ్ముడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాంబయ్య తెలిపారు. ఆయన తెలిపిన కథనం ప్రకారం.. వరంగల్‌ రంగశాయిపేట నెహ్రూ విగ్రహం సమీప కాలనీకి చెందిన గుమ్మడి ఇందిర తల్లిదండ్రుల ఆస్తి విషయంపై అతడి తమ్ముడు మునికుంట్ల ఆగయ్యతో సోమవారం గొడవ జరిగింది. ఈగొడవల్లో అక్కపై తమ్ముడు దాడి చేశాడు. ఆగయ్యపై ఇందిర ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నకిలీ డాక్యుమెంట్‌ సృష్టించిన వ్యక్తిపై..

ఖిలా వరంగల్‌: మామ ఇంటిపై నకిలీ డాక్యుమెంట్‌ సృష్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్న అల్లుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కుమార్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మిల్స్‌కాలనీ ఏరియా గాంధీనగర్‌లో చింతపండు సంజీవ్‌కు ఇల్లు ఉంది. అతడి అల్లుడైన లక్కం ప్రసాద్‌ మామ ఇంటిని కాజేసేందుకు నకిలీ డాక్యుమెంట్‌ సృష్టించి మామను బెదిరిస్తున్నాడు. దీంతో చింతపండు సంజీవ్‌ చిన్నాన్న శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కుమార్‌ తెలిపారు.

Read latest Mahabubabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top