మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మాధవరం జాతీయ రహదారిలో చెట్నేహళ్లి పంచాయతీ కార్యాలయం వద్ద ఆదివారం బెస్త తేజ (12)ను కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనపై ఎస్ఐ మల్లికార్జున తెలిపిన వివరాల మేరకు.. బెస్త తేజ మంత్రాలయం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6 తరగతి చదువుతున్నాడు. ఆదివారం కావడంతో మంత్రాలయంలో పూలు అమ్ముతున్న అమ్మ (భీమేశ్వరి)కి మధ్యాహ్నం క్యారియర్ ఇచ్చి 2 గంటల సమయంలో తిరిగి వస్తున్నాడు. చెట్నేహళ్లి పంచాయతి కార్యాలయం వద్ద ఆటో దిగిన తేజ రోడ్డు దాటుతుండగా రాయచూరు వైపు నుంచి వస్తున్న కారు (జీజే 16 సీఏ 8320) వేగంగా ఢీకొట్టింది. రాయచూరుకు చెందిన దర్శన్ రాజ్ (19) కారు నడుపుతున్నాడు. ప్రమాదంలో బాలుడి దవడ, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం ఇచ్చారు. తల్లి, బంధువులు వచ్చి బాలుడికి ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. బాలుడి చిన్నమ్మ ఈరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.


