● అధ్వానంగా ఉరుకుంద రహదారి
కౌతాళం: ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన ఉరుకుందకు వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా ఆలయానికి 20 లక్షల నుంచి 25 లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఉత్సవాల నుంచి ఆలయానికి ఒక్క నెలలోనే రూ.10 కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుంది. అయితే స్వామి దర్శనానికి వచ్చే భక్తులు రోడ్డు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారు. కౌతాళం నుంచి ఉరుకుందకు ఆరు కిలోమీటర్ల రోడ్డులో వందల గుంతలు ఏర్పడ్డాయి. ఇదే రోడ్డు నుంచి శిరుగుప్ప, బళ్లారి, సింధనూరు, గంగవతి, కొప్పళ ప్రాంతాలకు వాహనాలు రాకపోకలు సాగించాల్సి ఉంది. ఈ రహదారిని బాగు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఉత్సవాలకు ముందు గుంతల్లో కంకర నింపి దానిపై తారు వేయడం మరిచారు. కనీసం గ్రావెల్ అయినా వేయకపోవడంతో రహదారి అధ్వానంగా మారింది.


