బేతంచెర్ల: ప్రముఖ వైష్ణవ పుణ్య క్షేత్రమైన శ్రీ మద్దిలేటి నరసింహస్వామి ఆలయం శనివారం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆయా ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు చర్యలు చేపట్టారు.
రేపు ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం ఎన్నికలు
కర్నూలు(అగ్రికల్చర్): ది కర్నూలు ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం నూతన పాలక వర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 31వ తేదీ ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి, సహకార శాఖ కర్నూలు సబ్ డివిజన్ అసిస్టెంటు రిజిస్ట్రార్ నాగరమణయ్య తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కృష్ణానగర్లోని శ్రీనివాస మందిరం కళ్యాణ మండపంలో చేతులెత్తే పద్ధతి ద్వారా నూతన పాలక వర్గం ఎన్నిక నిర్వహిస్తున్నట్లు ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నిక కార్యక్రమానికి సంఘం సభ్యులందరు హాజరు కావాలని చెప్పారు.
కర్నూలు డివిజనల్ డీడీగా భవాని శంకర్రెడ్డి
కర్నూలు(అగ్రికల్చర్): పశుసంవర్ధక శాఖ కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్గా భవాని శంకర్రెడ్డి నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం కర్నూలు డివిజన్ కార్యాలయంలో సహాయ సంచాలకులుగా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం డివిజనల్ డీడీగా విధులు నిర్వహిస్తున్న వసంతలక్ష్మి ఈ నెల 31న స్వచ్ఛంద పదవీ విరమణ చేయనున్నారు. ఖాళీ అవుతున్న ఈ పోస్టులో పూర్తి అదనపు బాధ్యతలతో భవాని శంకర్రెడ్డిని నియమిస్తూ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.


