బొమ్మలసత్రం: నంద్యాల పట్టణ శివారులోని రైతునగరం వద్ద ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులను పోలీసులు కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు. ఘటనపై శనివారం స్థానిక తాలుకా పోలీస్టేషన్లో ఏఎస్పీ సుస్మిత పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. పట్టణంలోని నడిగడ్డ వీధికి చెందిన విద్యార్థి, శంకరాపురం గ్రామానికి చెందిన మరో విద్యార్థి పాఠశాలలో 10వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నారు. చదువుపై ఇష్టం లేక హాస్టల్ నుంచి పారిపోవాలని ప్లాన్ చేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో హాస్టల్ గోడదూకి పారిపోయారు. విద్యార్థులు కనిపించకపోవటంతో ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఇద్దరు కలిసి కడప రైల్వే స్టేషన్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. కడప జిల్లా పోలీసులను అప్రమత్తం చేసి ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకుని నంద్యాలకు తరలించి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును చేధించిన సీఐ ఈశ్వరయ్య, ఎస్ఐలు, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు.


