● 31 ఏళ్ల తర్వాత నిర్ణయం
● వచ్చే నెల 3 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం
కర్నూలు (టౌన్): ఉమ్మడి రాష్ట్రంలో 31 సంవత్సరాల క్రితం కర్నూలు కార్పొరేషన్లో మేయర్ ఎన్నికను ప్రత్యక్ష పద్ధతిన నిర్వహించారు. ప్రస్తుత ప్రభుత్వం ఇదే విధానాన్ని మళ్లీ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఇద్దరు డిప్యూటీ మేయర్లకు గాను ఒక్కరికే అవకాశం కల్పిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. గతంలో కర్నూలు కార్పొరేషన్లో ఒకే అసెంబ్లీ నియోజకవర్గం, 44 వార్డులు ఉండేవి. మేజర్ గ్రామ పంచాయతీ కల్లూరు 2002లో విలీనం కావడంతో వార్డుల సంఖ్య పెరిగింది. స్టాంటన్ పురం, మామిదాలపాడు, మునగాల పాడు గ్రామాలను 2017లో విలీనం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పందిపాడు, లక్ష్మీపురం, పెద్దపాడు గ్రామాలు విలీనం కావడంతో వార్డుల సంఖ్య 52కు చేరింది. పాణ్యం అర్బన్, కోడుమూరు అర్బన్ ప్రాంతాలు కర్నూలు కార్పొరేషన్లో విలీనం అయ్యాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం మరోసారి వార్డుల సంఖ్యను 52 నుంచి 68కు పెంచింది.
ఇదీ చరిత్ర
● కర్నూలు మున్సిపాల్టీని 1994లో కార్పొరేషన్గా
అప్ గ్రేడ్ చేశారు.
● ఎన్నికలు 1995లో నిర్వహించగా ప్రత్యక్ష పద్ధతిన
మేయర్గా బంగి అనంతయ్య ఎన్నికయ్యారు.
● వరుసగా ప్రత్యక్ష ఎన్నికల్లో 2000లో ఫిరోజ్ బేగ,
2005లో రఘరామిరెడ్డి ఎన్నికయ్యారు.
● 2010 నుంచి 2020 వరకు రెండు పర్యాయాలు
ఎన్నికలు నిర్వహించలేదు.
● వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 2020న మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికను పరోక్ష పద్ధతిన ఎన్నుకున్నారు.
● కార్పొరేషన్లో 31 సంవత్సరాల తర్వాత ప్రత్యక్ష పద్ధతిన మేయర్ ఎన్నుకోవాలని నిర్ణయించారు.
వచ్చే నెల 3 నాటికి ఓటర్ల జాబితా
కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేపట్టింది. ‘సర్’ ప్రక్రియలో అభ్యంతరాలకు సంబంధించి విచారణ తుది దశకు వచ్చింది. వచ్చే నెల 3వ తేదీ నాటికి వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. రెండు నుంచి నాలుగు వార్డులకు ఒక అధికారిని నియమించేందుకు జాబితా పంపించాలంటూ ఇప్పటికే ఎన్నికల కమిషన్ కమిషనర్లకు లేఖ రాసింది. తాజాగా ప్రభుత్వం మేయర్ల ఎన్నిక విషయంతో పాటు ఒక్కరికే డిప్యూటీ మేయర్కు అవకాశం కల్పించింది. అలాగే బీసీ రిజర్వేషన్లను 33 శాతం అమలు చేస్తామని ప్రకటిస్తూ కేబినేట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రక్రియపై దృష్టి సారించాయి. ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే పోటీ ఉంటుంది. బరిలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ ఉన్నాయి.


