ఆలూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతి, ఆమె భర్త వైకుంఠం ప్రసాద్ ఏకపక్ష ధోరణితో వ్యవహరించడం వల్ల ఈ నియోజకవర్గంలో కూడా సీనియర్లు చాలా మదనపడుతున్నారు. మండల స్థాయి నాయకులు సుధాకర్, మీనాక్షినాయుడు, వెంకటేశ్వర్లు, కప్పట్రాళ్ల బొజ్జమ్మ, రామచంద్రనాయుడు, ఉచ్చీరప్ప, రాంనాథ్యాదవ్, అశోక్యాదవ్, నరసప్ప తదితరులు పార్టీ కోసం కష్టపడుతున్నా, వీరి పట్ల ఆమె అనుసరిస్తున్న తీరు వల్ల ఎవరికి వారే అనే రీతితో పార్టీలో కొనసాగుతున్నారు. నియోజకవర్గ ఇన్చార్జిని మార్చి కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే తప్ప పార్టీ పరిస్థితి బాగుపడే అవకాశం లేదు. మంత్రాయలం నియోజకవర్గంలో పార్టీ ఇన్చార్జి రాఘవేంధ్రరెడ్డి, మాజీ అధ్యక్షులు తిక్కారెడ్డి గ్రూపు రాజకీయాల వల్ల పార్టీలో కొందరు ఎటూ వెళ్లలేక మౌనంగా ఉంటున్నారు. కోసిగి, పెద్దకడుబూరు, మంత్రాలయం, కౌతాళం మండలాల్లో చాలా మంది సీనియర్ నాయకులు పార్టీకి అంటీముట్టనట్లు ఉన్నారు. రాఘవేంధ్రరెడ్డి కంటే సీనియర్లుగా పార్టీలో కొనసాగుతున్న వారు ఆయన నాయకత్వాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. చూడి ఉలిగయ్య, ఆదినారాయణ శెట్టి, భరధ్వాజశెట్టి, రమాకాంతరెడ్డి, పన్నాగ వెంకటేశ్వర్లు తదితర సీనియర్లు చురుగ్గా పనిచేయకపోవడం వల్ల వారి అనుచరులు కూడా మనకెందుకులే అనే ధోరణిలో ఉంటున్నారు.


