కర్నూలు(హాస్పిటల్): డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(అకడమిక్) డాక్టర్ సత్యనారాయణ మూర్తి గురువారం కర్నూలు మెడికల్ కాలేజీ, కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లను సందర్శించారు. కాలేజీలోని పెండింగ్లో ఉన్న ఎగ్జామినేషన్ సెక్షన్, ఆడిటోరియం, లెక్చరర్ గ్యాలరీ, స్కిల్ ల్యాబ్, నిర్మాణంలో ఉన్న ఐపీ బ్లాక్ పనులను పరిశీలించారు. ఆసుపత్రిలో పారిశుధ్య, సెక్యూరిటీ గార్డుల విధులపై ఆరా తీశారు. అనంతరం కౌన్సిల్ హాలులో హెచ్ఓడీలు, ప్రొఫెసర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించి వారి సమస్యలు, అత్యంత ముఖ్యమైనవి, అత్యవసరంగా చేయాల్సిన పనుల గురించి చర్చించారు. లెక్చరర్ గ్యాలరీ త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, ఐపీ బ్లాక్ కనీసం రెండు ఫ్లోర్లైనా అందుబాటులోకి తెస్తే అనేక విభాగాలకు మేలు చేసినట్లు అవుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.చిట్టినరసమ్మ కోరారు. అనంతరం స్కిల్ల్యాబ్ వద్ద ఆయన మొక్కలు నాటారు. పీజీలకు నిర్వహిస్తున్న జీఎల్పీ, జీసీపీ, ఎథిక్స్ సమావేశంలో పాల్గొని వారిని ఉద్దేశించి మాట్లాడారు. ఆసుపత్రిలో ముఖ్యమైన సమస్యలను సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు వివరించి చెప్పారు.


